- నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశం..
- ఆగస్టు 23 లేదా 24న చంద్రునిపై ల్యాండింగ్కు అవకాశం
- శాస్త్రవేత్తల ఆనందం…రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 14 : చందమామపై అన్వేషణలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్వహించిన చంద్రయాన్-3 విజయవంతంగా నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశించింది. శుక్రవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 2.35 గంటలకు ఎపి తిరుపతి జిల్లా శ్రీహరికోట ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఎల్విఎం-3 ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. 24 రోజుల పాటు చంద్రయాన్-3 భూ కక్ష్యలో ప్రదక్షిన చేసిన అనంతరం చంద్రుడి వైపు పయనించనుంది. మూడు దశలను పూర్తి చేసుకుని చంద్రయాన్ చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 3.5 అక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించి ఆగస్టు 23 లేదా 24న చంద్రుణి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ కానుంది.
కాగా చంద్రయాన్లో-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయోగానికి 25 గంటలకు పైగా కౌంట్డౌన్ గురువారం 1.05 కు మొదలైంది. ఇప్పటి దాకా ఏ దేశమూ వెళ్లని చంద్రుని రెండో వైపుకు ఈ ల్యాండర్, రోవర్లు వెళ్లనున్నాయి. ఇప్పటి వరకు అనేక దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తరం ధృవంపై పరిశోధనలు నిర్వహించాయి. కానీ భారత్ మాత్రం 2008లో చంద్రయాన్-1 నుంచి ఇపుడు 2023లో చంద్రయాన్-3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధృవం వైపు తన పరిశోధనలు కొనసాగిస్తూ వొస్తున్నది. సూర్యుని కిరణాలు పడని చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ను దించనున్నారు.
దాంతో ఇప్పుడు మొత్తం ప్రపంచం దృష్టి భారత్ వైపు ఉంది. కాగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ బుధవారం నుంచి షార్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. చంద్రుణ్ణి లోతుగా అధ్యయనం చేసి, అక్కడ నిక్షిప్తమై ఉన్న రహస్యాలను వెలికితీయడమే చంద్రయాన్-3 ప్రధాన లక్ష్యం. కాగా చంద్రయాన్-3 విజయవంతంగా బనిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశించడంపై శాష్త్రవేత్తలు తమ హర్షాతిరేలు వ్యక్తం చేశారు. ఇక రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.




