ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కడ్తాల్ గ్రామపంచాయతీలో గురువారం పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామ ప్రజలు సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సమస్య, విద్యుత్ లైట్ల పునరుద్ధరణ మొదలైన సమస్యలు ఎక్కడ తలెత్తకుండా గ్రామపంచాయతీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి మరియు 108 వాహనం ఏర్పాటు చేయాలని యువకులు కోరగా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు తనవంతుగా కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. గ్రామసభల ద్వారానే గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని తద్వారా గ్రామాభివృద్ధి జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధిలో పార్టీలకతీతంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు, అధికారులు పాలు పంచుకోవాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి మంగళపల్లి నరసింహ, సింగిల్ విండో డైరెక్టర్ చేగురి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, వార్డు సభ్యులు బిక్షపతి, మహేష్, గణేష్ గౌడ్, జంగమ్మరామచంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు భాస్కర్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, దేవేందర్, సంతోష్, రవి, జగన్, అశోక్ రెడ్డి, మల్లేష్ అధికారులు ప్రధానోపాధ్యాయులు జంగయ్య, ధనుంజయ, పి.హెచ్.సి సూపర్వైజర్ ఎల్లమ్మ, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.




