ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తన ఆట, పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చి, తెలంగాణ సాధనలో తాము భాగమయ్యామని అన్నారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణామ అని ఎలుగెత్తి చాటి తన ఆట, పాటలతో మలిదశ ఉద్యమానికి ఊపు తెచ్చి తెలంగాణ సాధనలో భాగమైన తెలంగాణ మట్టి బిడ్డ, ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిదని అన్నారు. గద్దర్ తో అనుబంధం మా అన్నయ్య, ప్రముఖ సీనీ దర్శకుడు బి.నర్సింగరావుతో 1970 నుండి మొదలయిందని వేదకుమార్ గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో ‘మా భూమి’తో మొదలై రంగులకల తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణలో దగ్గరగా పాల్గొన్నామని తెలిపారు. గద్దర్ తో 53 ఏళ్ల అవినాభావ అనుబంధం ఉందని, గద్దర్ పిల్లలను తమ పాఠశాలలో చదివించడమేగాక కుటుంబానికి ఒక అత్మీయ వ్యక్తిగా భావించే వారమని అన్నారు.




