- సిఎం కెసిఆర్ శంఖారావానికి సర్వం సిద్ధం – ఖిల్లా గుమ్మంలో జాతీయ నేతల అడుగు
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- బహిరంగసభకు భారీగా జన సమీకరణ
- ఖమ్మం సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పు….తుది ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు
ఖమ్మం / కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 17 : దేశ రాజకీయాలలో సీఎం కేసీఆర్ క్రియా శీలక పాత్ర పోషిం చనున్న నేపథ్యంలో కలిసొచ్చిన ఖమ్మం ఖిల్లా వేదికగా నిర్వహించే సభకు భారీ ఏర్పాట్లు చేశారు. బిఆర్స్ జాతీయ పార్టీగా అవతరించిన తరువాత నిర్వహించే తొలి బహిరంగ సభకావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఖమ్మం అగ్ర నేతలు. దీంతో రోడ్లన్నీ కనుచూపుమేరకు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలతో సభకు హాజరయ్యే జాతీయ నేతలకు ఘన స్వాగతం ఏర్పాట్లు చేశారు. దీనితో ఖమ్మం జిల్లా గులాబీ మయంగా దర్శనం ఇస్తోంది. సభకు పెత్త ఎత్తున ప్రజలను సమీకరంచేందకు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల లో సమావేశాలు, సభలు నిర్వహించారు. సిఎం కేసీఆర్ శంఖారావాని పూరించేందుకు సభాస్థలిని నేతలు సమాయ త్తం చేశారు. బిఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం నిర్వహిస్తు న్న తొలి బహిరంగ సభ అవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జరిగే సభ ద్వారా దేశానికి సందేశం ఇవ్వను న్నారు.
ఈ వేదిక నుండి బీఆర్ఎస్ విధి విధానాలు దేశ ప్రల ముందుకు ఉంచనున్నారు. అబ్ కి బార్ కిసాన్కి సర్కార్ అనే నినాదంతో ఖమ్మంలో నిర్వహించే సభనుండి కేంద్రానికి సవాళ్ళు విసరనున్నారు సిఎం. ఎనిమిదేళ్ళ పాలనలో స్వరాష్ట్రంలో తెంలంగాణ సాధించిన విజయాల ను దేశానికి వివరిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచి వారిని బిఆర్ఎస్వైపు ఆకర్షించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. జాతీయ రాజకీ యలలో కీలక పాత్రపోషించేందకు జాతీయ నేతల మద్దతు కూడగట్టేందుకు ఇతర రాష్ట్రాల సిఎంలతోపాటు వివిధ పార్టీల జాతీయ నాయలకులను ఈ సభకు ఆహ్వానించారు. ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో తెలంగాణ సిఎం కేసీఆర్తోపాటు ఆమ్ఆద్వీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ సింగ్, కేరళా సిఎం పినరయ్ విజయన్, యూపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ నాయకుడు రాజా వేదిక ను పంచుకోంటారు.
దారులన్నీ ఖమ్మం గుమ్మంవైపుకు…
బిఆర్ఎస్ సభ కోసం ప్రజలను భారీగా తలరించేందుకు పెద్ద ఎత్తున సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణకు గడచిన మూడు రోజులనుం ట్రబుల్ షూటర్ అయిన మంత్రి హరిష్ రావు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఖమ్మంలో ఇటీవ నెలకొన్న రాజకీయ పరిస్థితులలో సభను వియజవంతం చేసేందకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సభ నిర్వహణ బాధ్యతలు తన భుజాన వేసుకున్నారు. సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జిల్లా అగ్రనాయకులు. సభా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పనును సమీక్షిస్తూ ఏర్పాట్లలో నిమజ్ఞమయ్యారు ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మోల్సీలు తాతా మధుసుదన్ రావు, పల్లా రాజేశ్వరరావు, ఎమ్మెల్యేలు. దీంతో జిల్లా నలుమూలల ఎటు చూసినా గులాబీ జెండాలతో రోడ్లు అన్నీ గుబాలిస్తున్నాయి. ఈ భారీ బహిరంగ సభకు ప్రజలను ఖమ్మం వైపుకు ఆహ్వానిస్తున్నాయా అన్నట్లు అనిపించక మానదు.
సభాస్థలి ఏర్పాట్లు…
ఖమ్మంలో పాలనా సౌలభ్యానికి నిర్మించిన నూతన కలెక్టర్ భవనం సమీపంలో 100 ఎకరాలలో సభా ప్రంగణాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 5లక్షల మంది ప్రజలు సభకు హాజరవుతారని అంచన. సభను వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభాప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. సిఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు 60 వేల కుర్చీలు ఏర్పాటు చేశారు. మిగిలిన వారు నిలబడేందకు తగిన ఏర్పాట్లు చేశారు. జనాలు భారీగా తరలి వస్తున్న నేపధ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా, తొక్కిసలాట జరగకుండా ముందస్తుగా బారికేట్ల సహాయంతో ప్రత్యే గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వెయ్యి మందికిపైగా వాలంటీర్లను నియమించారు. ఖమ్మం వచ్చే ప్రధాన ద్వారాలైన ఖమ్మ ఇస్ట్, వెస్ట్ రోడ్లు ఇప్పటికే విస్థరణ జరిగింది. జిల్లాలోని నలుమూల ఉన్న రోడ్డనుండి సభకు వచ్చే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 400 ఎకరాలలో విఐపిలకు, నియోజకవర్గాలవారిగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
అంతా కట్టుదిట్టం…
బుధవారం ఉదయం హైదరాబాద్లో సిఎం కెసిఆర్ ముఖ్య జాతీయ నేతలతో సమావేశం. అనంతరం రెండు ప్రత్యే హెలికాప్టర్లో యాదాద్రి దేవాలయానికి వెల్లి దైవ దర్శనం అనంతరం తిరిగి ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభం వెనువెంటనే సమీపంలోని బహిరంగ సభకు హాజరవుతారు. సభ ముగియగానే తిరిగి హైదరాబ్ ప్రయాణమవుతారని బిఆర్ఎస్ నేతలు వెల్లడించారు. సిఎం పర్యటనలో భాగముగా ఖమ్మం నందు నిర్మించిన కొత్త కలెక్టరేట్ కార్యాలయ సముదాయాల ప్రారంబోత్సవం, పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభ ఉన్నదున ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 వరకు ఖమ్మం వైపునకు వచ్చే సాదారణ, భారీ వాహనాల ట్రాఫిక్ను నియంత్రణకు ఈ రూట్లలో ఖమ్మం టౌన్ నుండి దారి మళ్ళిస్తున్నట్లు జిల్లా పోలీస్ కమీషనర్ తెలిపారు.
ఖమ్మం నుండి హైదరాబాద్, వరంగల్ వైపుకు వెళ్ళు వాహనాలు నాయుడు పేట, ఏదులాపురం, వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా మరిపెడ బంగ్లా, తోర్రురు వైపు వెళ్ళాలని తెలిపారు. విజయవాడ, వైరా రాజమండ్రి, సత్తుపల్లి వైపు వెళ్ళు వాహనాలు వేంకటగిరి క్రాస్ రోడ్డు, కోదాడ, విజయవాడ హైవే వైపువెళ్ళాలని, ఇల్లందు వైపు వెళ్ళు వాహనాలు రామన్న పేట, డోర్నకల్, మహాబుబాబ్ వైపుపునకు, కోదాడ వైపుకు వెళ్ళు వాహనాలు ముస్తఫ నగర్ మీదుగా బోనకల్, చిల్లకల్లు వైపుకు, మహబూబాబాద్ వైపుకు వెళ్ళు వాహనాలు నాయుడు పేట క్రాస్ రోడ్డు, ఏదులాపురం జంక్షన్ , తిరుమలాయపాలెం మరిపెడ మీదుగా మహబూబాబాద్ వైపుకు ఇలా మొత్తం 18 మార్గాలను సూచించారు.దారి మళ్లించిన మార్గాలను గుర్తించి ఆ మార్గాలలో ప్రయాణాలను కొనసాగించి ఖమ్మం పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ కోరారు.
ఖమ్మం సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పు….తుది ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు
ఇప్పుడు దేశం చూపు ఖమ్మం వైపు ఉందని, ఖమ్మంలో బిఆర్ఎస్ సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పు వొస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆయన అన్నారు.. జాతీయ రాజకీయాలపై ఖమ్మం సభ ద్వారా సీఎం కేసీఆర్ దశదిశ చూపిస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో ఇక కీలక భూమిక పోషించబోతున్నారని అన్నారు. భాజాపాకు తెలంగాణలో స్థానం లేదని, గత ఎన్నికల్లో భాజాపా ఒక్క సీటే గెలిచిందని మంత్రి తెలిపారు. బీజీపే ఏ ఒక్క వర్గానికి మేలు చేయడం లేదని, దేశ ప్రజల్లో ఆపార్టీపై వ్యతిరేకత ఉందని, ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్పై ప్రజల్లో నమ్మకం తగ్గిందని మంత్రి వెల్లడించారు. ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఆత్మగౌరవం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని హరీష్ రావు తేల్చి చెప్పారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి మంగళవారం హారీష్ రావు సభాస్థలిని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆహ్వానం మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభకు హాజరుకానున్నారు. దిల్లీ సీఎం కేజ్రివాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ నేత రాజా ఖమ్మం సభలో పాల్గొంటారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు నష్టం చేసే 3 చట్టాలు తెచ్చి ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన తెలిపారు. అంతేకాదు ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో బిజెపి బెదరింపులకు పాల్పడుతుందని, అయితే వాటికి భయపడబోమని అన్నారు. జాతీయ నేతలు రాకతో దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయం లిఖించేందుకు కేసీఆర్ మొదలుపెట్టిన బీఆర్ ఎస్ పార్టీకి జాతీయ నేతలు మద్దతిస్తున్నారు. ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభ వేదికగా విపక్షాల ఐక్యత చాటనున్నారు. సీఎం కేసీఆర్ బుధవారం ఖమ్మం జిల్లాలో చారిత్రాత్మకమైన సభ నిర్వహించబోతున్నారని, బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కీలకపాత్ర పోషించబోతున్నారని, దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా బలపరుస్తున్నారని, దేవెగౌడ కుమారుడు కుమారస్వామి దగ్గర నుంచి అఖిలేష్ యాదవ్ వరకు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. దేశానికి దశ దిశ బీఆర్ఎస్ చూపిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అందరి చూపు తెలంగాణ వైపే ఉందని, అన్ని రాష్ట్రాలు తెలంగాణను అనుకరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పనిసరిగా ఈ జాతికి ఉత్తమ సేవలందిస్తారని మంత్రి హరీష్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ బహిరంగ సభకు జాతీయ నేతలు, వీవీఐపీలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. అందుకని 4 వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలకు స్పెషల్ పాస్లు అందించనున్నారు. 100 ఎకరాల్లో సభాస్థలాన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ జరిగే ప్లేస్కు 500 విటర్ల లోపు దాదాపు 480 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. ప్రతి వాహనానికి క్యూఆర్ కోడ్ జారీ చేయనున్నారు. పోలీసులకు సహాయంగా వాలంటీర్ల నియమించారు. ప్రజలకు మజ్జిగ, మంచినీళ్లు అందించున్నారు.•





