- అదనంగా 34 పార్థివ వాహనాలు అందుబాటులోకి
- మొత్తం 466 వాహనాలు ఆగస్టు 1న ప్రారంభం
- పెరుగనున్న అత్యవసర సేవల విస్తృతి
హైదరాబాద్ ప్రజాతంత్ర జూలై 28 : రాష్ట్రంలో 108 అంబులెన్సులు, 102(అమ్మ ఒడి), హర్సె(పార్థివ వాహనాల) సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు వైద్యారోగ్య శాఖ నూతనంగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 హర్సె వాహనాలను కొనుగోలు చేసింది. వీటిని ఆగస్టు 1వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 108, 102, పార్థివ వాహనాల పనితీరుపై మంత్రి హరీష్ రావు గత నెలలో సమీక్ష నిర్వహించారు. అత్యవసర సమయాల్లో ఆయా వాహనాల ద్వారా అందుతున్న సేవలను కొనియాడారు. సిబ్బందిని అభినందించారు. వాహనాల పనితీరు, రిపేర్లు, మెయింటెనెన్స్ వంటివి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.
కాలం చెల్లిన అంబులెన్స్లు, అమ్మ ఒడి, హర్సె వాహనాలను వెంటనే తొలగించి, వాటి స్థానంలో నూతన వాహనాలను చేర్చాలని ఆదేశించారు. తద్వారా గర్భిణులు, రోగులను వేగంగా దవాఖానలకు చేర్చేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు అధికారులు కొత్త వాహనాలను కొనుగోలు చేసి, బ్రాండింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్ చేస్తుస్తండగా, మరో 29 అంబులెన్సులను అవసరమున్నట్లు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ఈ 204 కొత్తవి కలుపుతే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెరగనున్నది.




