కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్‌

కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్‌ మున్షీ

హైదరాబాద్‌,ఏప్రిల్‌5 : గ్రేటర్‌ హైదరాబాద్‌లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ సిఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. కూన శ్రీశైలం గౌడ్‌కు దీపాదాస్‌ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

గురువారం కాంగ్రెస్‌ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్‌ రెడ్డి తదితరులు కూన శ్రీశైలం ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. 1992 నుంచి యూత్‌ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరపున కుత్బుల్లాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో బిజెపిలో చేరి 2023లో కుత్బుల్లాపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ టికెట్‌ ఆశించిన కూన శ్రీశైలంకు పార్టీ మొండి చేయి చూపింది. దీంతో ఆయన కొద్ది రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన ఇవాళ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగా, రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లో కనీసం 14 స్థానాల్లోనైనా విజయం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *