8 మంది విద్యార్థులు సస్పెండ్
బెంగుళూరు, డిసెంబర్ 14 : హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమ వ్యవహారం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో కొత్త వివాదానికి దారి తీసింది. మతాంతర సంబంధంపై కాలేజీలో జరిగిన గొడవలో 18 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యం. సస్పెండ్ అయిన విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో హిందూ బాలిక, ముస్లిం వ్యక్తి మధ్య మతాంతర సంబంధంపై కాలేజీలో వాగ్వాదం జరిగింది. సస్పెండ్ అయిన విద్యార్థులంతా పీయూసీ చివరి సంవత్సరం చదువుతున్నారు. సస్పెండ్ అయిన 18 మందిలో ముగ్గురు విద్యార్థినులు కూడా ఉన్నారు. సస్పెండ్ అయిన విద్యార్థుల్లో 10 మంది హిందువులు కాగా.. 8 మంది ముస్లింలు ఉన్నారు.
మూడు నెలల క్రితం ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమించుకోవడంతో ఈ వివాదం ప్రారంభం అయింది. కళాశాల అధికారులు దీని గురించి అమ్మాయి తల్లిదండ్రులను హెచ్చరించారు.
అయితే ఇటీవల అమ్మాయి వద్ద సదరు వ్యక్తికి రాసిన లవ్ లెటర్ ని తోటి విద్యార్థులు కనుగొన్నారు. కాలేజీ యాజమాన్యం దీనిపై కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే హిందూ యువతి, ముస్లిం అబ్బాయితో సంబంధం పెట్టుకోవడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చిలికిచిలికి పెద్ద ఘర్షణకు కారణం అయింది. కాలేజీ ఆవరణలోనే ఇరు వర్గాల విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారంలో ఈ ప్రేమ జంటకు సహకరించిన విద్యార్థులతో పాటు దీన్ని వ్యతిరేకిస్తూ గొడవకు దిగిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ తాత్కాలికమే అని.. త్వరలోనే సస్పెన్షన్ రద్దు చేస్తామని కాలేజీ యాజమన్యం చెప్పింది.



