ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం యథాతథం

ఎన్జీటి తీర్పుపై స్టేకు సుప్రీమ్‌ ‌కోర్టు నిరాకరణ
న్యూ దిల్లీ, జూలై 14(ఆర్‌ఎన్‌ఎ) : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అడ్డగోలుగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిషేధించాలంటూ ఎన్జీటి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. గత మార్చి 23న ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విధించిన నిషేధాన్ని తొలగించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ‌సంజయ్‌ ‌కరోల్‌ ‌ధర్మాసనం ఎన్జీటి తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జగన్‌ ‌ప్రభుత్వం ఇసుక తవ్వకాలను గంపగుత్తగా జయప్రకాశ్‌ ‌పవర్‌ ‌వెంచర్స్ ‌లిమిటెడ్‌ ‌పరం చేసింది.

పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఏపీలో ఇసుక తవ్వకాలను జయప్రకాశ్‌ ‌పవర్‌ ‌వెంచర్స్ ‌లిమిటెడ్‌ ‌చేపట్టింది. ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన ఎన్జీటి.. ఇసుక తవ్వాలపై నిషేధం విధించింది. ఎన్జీటి తీర్పును సుప్రీంకోర్టు సమర్ధిస్తూ.. ఎన్జీటి తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశించింది. బి2 కేటగిరీ ఇసుక రీచ్‌లలో పాక్షికంగా యంత్రాలతో ఇసుక త్వవకానికి అనుమతి ఇవ్వడం చట్ట విరుద్దమని ఎన్జీటి పేర్కొంది. బి1, బి2 కేటగిరీల కింద ఇసుక తవ్వకాల కోసం ఇప్పటికే ఇచ్చిన అన్ని రకాల పర్యావరణ అనుమతులను పరిశీలన చేయాలని ఎన్జీటి ఆదేశించింది.

రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ పర్యావరణ అనుమతులను పునః పరిశీలన చేయాలని ఎన్జీటి అదేశించింది. రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల పరిధిలో పర్యావరణ విధ్వంసం పరిశీలన, అంచనా కోసం ఎన్జీటి నిపుణుల కమిటీని నియమించింది. ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించాలని కూడా నిపుణుల కమిటీని ఆదేశించింది. రివర్‌ ‌బెడ్లు, నదీ తీరాల్లో భారీ యంత్రాలతో మైనింగ్‌ ‌చేసుకోవచ్చంటూ అనుమతివ్వడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఎన్జీటి విధించిన రూ.18 కోట్ల జరిమానాపై మాత్రమే సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులైన నాగేంద్ర కుమార్‌, ‌హేమకుమార్‌లకు న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *