న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నమోదైన కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమెకు బెయిలు మంజూరైంది. సీబీఐ నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆమెకు గతంలోనే బెయిలు లభించింది. తనపై షెడ్యూల్డు నేరం వెల్లడికాలేదని చిత్ర రామకృష్ణ తన బెయిలు పిటిషన్లో హైకోర్టుకు తెలిపారు. ఈ ఆరోపణలు మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి రావన్నారు. ఈ కుట్రకు సూత్రధారి ఆమె కాబట్టి ఆమెకు బెయిలు మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టును కోరింది. అయినప్పటికీ ఆమెకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. చిత్రకు బెయిలు మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ జస్మీత్ సింగ్ వెల్లడించారు. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కుంభకోణం కేసులో చిత్రను మొదట సీబీఐ అరెస్ట్ చేసింది.
ఆ తర్వాత గత ఏడాది జూలై 14న ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆమెకు గత ఏడాది సెప్టెంబరులో సీబీఐ కేసులో బెయిలు మంజూరైంది. ఈడీ ఆరోపణల ప్రకారం 2009 నుంచి 2017 మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎన్ఎస్ఈని, అందులోని ఉద్యోగులను మోసం చేయడానికి చిత్ర రామకృష్ణ, మాజీ ఎన్ఎస్ఈ సీఈఓ రవి నారాయణ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవి వారణాసి, హెడ్ (ప్రెమిసెస్) మహేశ్ హల్దిపూర్, మరికొందరు కుట్ర పన్నారు. ఎన్ఎస్ఈ సైబర్ వల్నరబిలిటీస్పై పీరియాడిక్ స్టడీ చేస్తున్నామనే ముసుగులో ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్ కాల్స్ను చట్టవిరుద్ధంగా వినడానికి ఓ సంస్థతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. చిత్ర రామకృష్ణ ఎన్ఎస్ఈ జాయింట్ ఎమ్డీగా 2009లో నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1 నుంచి 2016 డిసెంబరు వరకు ఆమె ఎన్ఎస్ఈ ఎమ్డీ అండ్ సీఈఓగా పని చేశారు.



