- గుమికూడిన జనంపైకి దూసుకెళ్లిన మరోకారు
- తొమ్మిది మంది దుర్మరణం
అహ్మదాబాద్, జూలై 20 : అహ్మదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్లై ఓవర్ పై కారు ప్రమాదం జరగ్గా..అక్కడ గుమిగూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని శాటిలైట్ ప్రాంతంలో గల సర్ఖేజ్-గాంధీ నగర్ హైవే పై ఉన్న ఇస్కాన్ బ్రిడ్జిపై తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో థార్ కారు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది.
దీంతో మిగతా వాహనదారులు అక్కడ గుమిగూడారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేస్తుండగా.. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఓ జాగ్వార్ కారు అక్కడ గుమిగూడిన జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.



