పుణె, జూలై 24 : ఓ పోలీసు అధికారి తన భార్యతో పాటు, మేనల్లుడిని కాల్చి ..తానూ కాల్చుకున్న విషాదకర ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పుణెళిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. అమరావతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. అంతకంటే ముందు తన భార్య మోని (44), మేనల్లుడు దీపక్ (35)లను తుపాకీతో కాల్చి చంపాడు.
సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, గైక్వాడ్ భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి పూణెళిలో ఉంటున్నారు. గైక్వాడ్ అమరావతి ఏసీపీగా విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన తర్వాతే ఇలా జరిగినట్టు పోలీసులు నిర్దారించారు. మరోవైపు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి.. ఆ ముగ్గురినీ జూపిటర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కాల్పులపై కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.



