హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారనీ..ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడానికి ఈ నెల 14న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయి.
సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, బీఎస్పీ, సీపీఐ, సీపీఎమ్, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. అక్టోబర్ 14న ఉదయం 10.30 గంటల నుండి 12.30 వరకు జరిగే ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా పాల్గొనాలని వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.




