దుబాయిలో బ్యాంకు ఖాతా కేసులో జైలు పాలయిన జగిత్యాల జిల్లావాసి

•సమస్య పరిష్కారానికి ప్రజావాణి•ఇంచార్జి జి.చిన్నారెడ్డి హామీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ) దేశం లోని దుబాయికి బతుకు దెరువు కోసం వెళ్లిన జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్‌ ‌గ్రామానికి చెందిన మల్లారపు మధుకర్‌ (27) అనే యువకుడు ఎవరో తన బ్యాంకు ఖాతాను దుర్వినియోగం చేసి లావాదేవీలు జరిపినందున అజ్మాన్‌ ‌లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్‌ ‌బ్యాన్‌) ‌విధించింది. మధుకర్‌ ‌తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్యలు మంగళవారం హైదరాబాద్‌, ‌బేగంపేట లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌ ‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ ‌రెడ్డి పేరిట ఒక వినతి పత్రం సమర్పించారు.

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌సూచన మేరకు ప్రజాభవన్‌ ‌కు చేరుకున్న వారికి ఎన్నారై అడ్వయిజరీ వైస్‌ ‌చైర్మన్‌ ‌మంద భీంరెడ్డి సహకరించారు. సీఎంఓ ద్వారా ప్రత్యేక శ్రద్ధతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజావాణి ఇంచార్జి, ప్రణాళిక సంఘం వైస్‌ ‌చైర్మన్‌ ‌జి. చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. గల్ఫ్ ‌దేశంలో జైలు పాలయిన మధుకర్‌ ‌కు కాన్సులర్‌ (‌దౌత్య) సహాయంతో పాటు న్యాయవాదిని సమకూర్చి ఉచిత న్యాయ సహాయం అందించి ఇండియాకు వాపస్‌ ‌తెప్పించాలని వారు అభ్యర్తించారు. న్యూ దిల్లీ లోని భారత విదేశాంగ శాఖతో, దుబాయి లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి తన కుమారుడిని ఆదుకోవాలని వారు సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కోరారు. వినతి పత్రం ప్రతిని తెలంగాణ స్టేట్‌ ‌లీగల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీ (న్యాయ సేవాధికార సంస్థ) కు కూడా పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *