వినియోగ దారుల హక్కులపై అవగాహన అవసరం

నేడు జాతీయ న్యాయ సేవల దినోత్సవం

1987లో ఇండియన్‌ ‌లీగల్‌ అథారిటీస్‌ ‌యాక్ట్ అమలులోకి వచ్చిన రోజు జ్ఞాపకార్థం, ప్రతి సంవత్సరం నవంబర్‌ 9‌వ తేదీన భారతదేశం అంతటా జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటారు. 1995లో భారతదేశంలో తొలిసారిగా జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ వేడుక దినోత్సవాన్ని ప్రారంభించింది. సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలను అందించడానికి నేషనల్‌ ‌లీగల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీ ఏర్పాటు చేయబడింది. చట్టపరమైన అవగాహనను వ్యాప్తి చేయడం, నేర బాధితులకు పరిహారం అందించడం, లోక్‌ అదాలత్‌లను నిర్వహించడం దీని ఇతర లక్ష్యాలు. ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం విధానాల ద్వారా వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించడంపై కూడా దృష్టి సారిస్తుంది.

సమాజంలో ప్రతి వ్యక్తి వినియోగదారుడే. ప్రతిరోజు ఎన్నో వస్తువులు కొంటాం, సేవలు పొందుతుంటాం. మనం పొందేవన్ని మేలుచేసేవిగా వుండాలి. మేలుచేసేవి పొందడం ప్రతి ఒక్కరి హక్కు. అందుకుగాను ప్రభుత్వం వినియోగదారులకు రక్షణను కల్పిస్తుంది. వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రాలు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వినియోగదారుల రక్షణ మండళ్ళు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సలహా సంఘాలు. వినియోగదారుల సంరక్షణ కేంద్రాలు తదితర వేదికలు వినియోగ దారునికి విన్నవించు కోవడానికి అందుబాటులో ఉన్నాయి. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు… అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు…అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది.

వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు…వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు…వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు… వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు… వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోసపోతున్నారు.

వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్‌ ‌మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ ‌ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ ‌ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ‌ఫోరమ్‌ ‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్‌ ‌యంత్రాంగంగా పని చేస్తాయి.

జాతీయ స్థాయిలో సెంట్రల్‌ ‌కన్స్యూమర్‌ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్‌ అథారిటీకి ఉంటుంది.  జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్‌లో డిపాజిట్‌ ‌చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్‌లో ప్రెసిడెంట్‌తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ట్రాలను  కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు.

రాష్ట్ర లీగల్‌ ‌సెల్‌ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *