2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పైన నిర్బంధం కొనసాగిస్తున్నప్పుడు పాడుకున్న పాట… “పాలన ఏం పాలన ఫాసిస్టు పాలన..కాంగిరేసు పాలన కసాయి మూకల పాలన…” ఈ పాట ఇప్పుడు 2025లో మళ్ళీ అదే కాంగ్రెస్ సర్కారులో పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల్లో తేడా ఏమీదనేది స్పష్టంగా కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికరంలోకి వచ్చిన తరువాత దేశంలో ఫాసిస్టు పోకడలు, మతోన్మాదం, నిర్బంధం తీవ్రతరం అయ్యాయి.
ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు పని చేసే పరిస్థితులు లేక కారు మబ్బులు కమ్ముకుని చీకట్లు ముసురుకుంటున్న సమయంలో బీజేపీని ఎదురుకోవడానికి మధ్యంతర మార్గంగా కాంగ్రెస్ పార్టీకి అనేకమంది ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నాయకులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, బుద్ధిజీవులు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దత్తు తెలిపి అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు, మానిఫెస్టోలో పెట్టని 7వ ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ, 420 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. సహజంగానే మనిషి ఆశాజీవి. కెసిఆర్ ప్రభుత్వంలో కన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు మరింత ఎక్కువ లబ్ది జరుగుతుందనే ఆశతో ప్రజలు కాంగ్రెసును గెలిపించారు.
అలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆశయాలను ఆకాంక్షలను ఎంతమేరకు నెరవేర్చింది, తెరాస పాలనను విమర్శించిన బుద్దిజీవులు, కాంగ్రెసు సర్కారు కోసం వోట్లేసిన ప్రజలు ఎంతమేరకు ఈ పాలనను సమర్థిస్తున్నారనేది చర్చించాల్సిన విషయం. కొత్త ప్రభుత్వం ఏర్పడి 17 నెలల కాలం గడిచిపోయింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యాయా? కనీసం మొదలు పెట్టారా? ప్రజలు అంతకు ముందు ప్రభుత్వం కన్నా ఎక్కువ లబ్ది పొందుతున్నారా? ప్రభుత్వ భూముల అమ్మకాలు ఆగిపోయాయా? కొత్త అప్పులు చేయడం లేదా? అవినీతి ఆగిపోయిందా? మేధావులు కోరుకున్న గుర్తింపు-గౌరవం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు పునరుద్దరించబడ్డాయా? ఇప్పుడు చూద్దాం. ప్రజలు (కాంగ్రెస్ కార్యకర్తలతో సహా) 7-8 నెలల క్రితం వరకు ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడు అది తీవ్ర వ్యతిరేకతగా మారి “ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కొనితెచ్చుకున్నామా” అనే ఆలోచనలోకి తీసుకెళ్లింది. ఇందుకు కారణం హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవడమే. మహిళలకు ఉచిత బస్సు పక్కన బెడితే (దాని పట్ల కూడా మహిళల్లో, పురుషుల్లో వ్యతిరేకతే నెలకొంది) మిగతా గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా 100% అమలు చేసాం అని చెప్పుకునే దైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
” ప్రజల్లో ఓపిక నశించకముందే, తిరుగుబాటు మొదలుపెట్టకముందే వీలయినంత త్వరగా ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలను మొదలు పెట్టాలి. అన్నిటికన్నా ముందుగా ఎగ్గొట్టిన రైతు భరోసాతో పాటు ఈ జనవరిలో ఇవ్వవలసి ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. తీసుకున్న రుణానికి సంబంధం లేకుండా లక్షన్నర రూపాయల వరకు షరతులు లేకుండా అందరికీ మాఫీ చేయాలి. ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే ఇండ్లు మంజూరు చేయడమో లేక ఇంటి నిర్మాణ ఖర్చులు విడుదల చేయడమో చేయాలి. గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంకు కాతాలో కాకుండా వినియోగదారుల వద్ద సిలిండరుకు 500 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో, కాలం కాక పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. యుద్ధప్రాతిపదికన ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు హామీ పడిన ఇతర పథకాల గురించి తెలంగాణ సమాజంతో సాధ్యాసాధ్యాలు చర్చించాలి..”
6 గ్యారంటీల అమలుకు బడ్జెట్లో కూడా అరకొర నిధులే కేటాయించారు. మహిళలకు నెలకు 2500 రూపాయాల గ్యారంటీ ఊసే లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు కట్టించింది లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తెలంగాణకు మొండి చేయి చూపే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే పనికి రాదని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్లికేషన్లో తిరిగి సర్వే నిర్వహిస్తే కానీ ఇండ్లు మంజూరు చేయమని కొర్రీ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ సర్వే చేయడం పెద్ద సవాలు కాగా, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా పేదలకు “ఇందిరమ్మ ఇండ్లు“ నిర్మించి ఇవ్వడం అసాధ్యమయిన విషయం. కాగా, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు దక్కలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపునిచ్చి 250 గజాల ఇంటి స్థలం ఇస్తానని హామీ ఇచ్చింది. ప్రొఫెసర్ కోదండరాంకు ఉద్యమకారులను గుర్తించే బాధ్యత కూడా ఇచ్చింది. ఇప్పటివరకు దాని చప్పుడే లేదు. విద్యార్థులకు ఉన్నత చదువులకు 5 లక్షల సహకారం అందిస్తా అని ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి మండలానికి ప్రపంచ స్థాయి పాఠశాలాలను నిర్మిస్తాం అన్నారు.
ఇప్పుడేమో కేవలం 28 స్కూళ్లకు మాత్రమే ఫౌండేషన్ స్టోన్ వేయగా ఎక్కడా పనులు మొదలు కాలేదు. నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్న పింఛన్ల సంగతేమో కానీ “ఇచ్చే రెండు వేల రూపాయలు ఎగ్గొట్టకుండా ఇస్తే దండం పెడుతాం” అంటున్నారు పింఛ నుదారులు. బడ్జెట్లో కూడా ఇందుకు సంబందించిన నిధులు కేటాయించలేదు. రైతు భరోసా అయితే గత వర్షాకాలం ఇవ్వాల్సిన భరోసానే ఎగ్గొట్టగా మొన్న జనవరిలో ఇవ్వాల్సిన భరోసా ఇంకా 3 ఎకరాలకు దాటకుండానే మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. గ్యాస్ సిలిండర్ కు 500 సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్తున్నప్పటికీ వినియోగదారుల వద్దయితే వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. సబ్సిడీ పైసలు బ్యాంకు అకౌంటులో పడుతున్నాయో లేవో దేవుడెరుగు.
రుణమాఫీ పూర్తి చేసాము అని చెప్పినప్పటికీ వాస్తవానికి లక్షన నర వరకే చేయగా వారిలో కూడా అనేకమంది రైతులకు ఇప్పటికీ మాఫీ కాలేదని తెలుస్తుంది. లక్షన్నర నుండి రెండు లక్షల ఋణం ఉన్నవారికి అస్సలే కాలేదు. రెండు లక్షలకు పైన ఋణం ఉన్న రైతులు అనేక మంది రెండు లక్షల పైన ఉన్న డబ్బును బయట ఎక్కువ మిత్తీలకు తెచ్చి బ్యాంకులో కట్టి రుణమాఫీ కాకపోయేసరికి లబోదిబోమంటున్నారు. చావు కబురు చల్లగా చెప్పినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు 2 లక్షల కన్నా ఎక్కువ ఋణం ఉన్నవారికి ఋణమాఫీ చేయకూడదన్నది తన ప్రభుత్వ నిర్ణయం అని 2 లక్షల వరకు ఉన్న రైతు లందరి రుణాలు మాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమే అవుతుంది.
గత బీఆర్ ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని, భూములు అమ్ముతుందని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు అప్పులు ఏమీ చేయడం లేదా అంటే అదీ లేదు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువే ఆస్తులు, భూములు తనకా పెట్టి అప్పులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం ద్వారా విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలనుకున్నది. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి మేధావులే ఈ నిర్ణయాన్ని తప్పు పట్టినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 1,60,000 కోట్ల రూపాయల అప్పు చేసి రికార్డు సృష్టించింది. మరి ఆ డబ్బంతా ఎటు పోతుంది అనేది సాధారణ ప్రజల ప్రశ్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేనటువంటి ప్రజాస్వామ్యం, హక్కులు పునరుద్దరించబడ్డాయా అంటే అదీ లేదు. ప్రశ్నించే ప్రజలపైన కేసులు సర్వసాధారణం కాగా, జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టి జైలుకు పంపించడం కొసమెరుపు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి రాష్టంలో నెలకొంది. అధికారం గడిచి కేవలం 17 నెలలే అయింది… పెను సవాళ్ళన్నీ కాంగ్రెస్ పార్టీకి ముందే ఉన్నాయి. కార్యకర్తలు, ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరకముందే ఎంపీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆ 8 సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు జరుపుకుంటూ వస్తున్నారు. ఇంకా ముందుకు జరపలేని సమయానికి వచ్చేసారు. అతి త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ 20శాతం సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. అలా అని ఎన్నికలను పోస్టుపోన్ చేయడానికి అవకాశం లేదు ఒకవేళ ఉన్నా హామీలు అమలు చేయడానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించే స్థితిలో లేదు. ఈ ఎన్నికలు అయిపోగానే వీటి ఫలితాల మీద అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరవచ్చు లేదా ఒకవేళ ఈ స్థానాలకు ఉపఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్క స్థానంలో కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవచ్చు.
ప్రజల్లో ఓపిక నశించకముందే, తిరుగుబాటు మొదలుపెట్టకముందే వీలయినంత త్వరగా ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలను మొదలు పెట్టాలి. అన్నిటికన్నా ముందుగా ఎగ్గొట్టిన రైతు భరోసాతో పాటు ఈ జనవరిలో ఇవ్వవలసి ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. తీసుకున్న రుణానికి సంబంధం లేకుండా లక్షన్నర రూపాయల వరకు షరతులు లేకుండా అందరికీ మాఫీ చేయాలి. ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే ఇండ్లు మంజూరు చేయడమో లేక ఇంటి నిర్మాణ ఖర్చులు విడుదల చేయడమో చేయాలి. గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంకు కాతాలో కాకుండా వినియోగదారుల వద్ద సిలిండరుకు 500 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో, కాలం కాక పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల ఎక్ గ్రేషియా చెల్లించాలి. యుద్ధప్రాతిపదికన ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు హామీ పడిన ఇతర పథకాల గురించి తెలంగాణ సమాజంతో సాధ్యాసాధ్యాలు చర్చించాలి. ఈ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చరిత్రలో మిగిలిపోవాల్సిందే.
ఇప్ప పృథ్వి రెడ్డి
సాఫ్ట్ వేర్ ఉద్యోగి,తెలంగాణ.