జీవకోటి మనుగడకు నీరు ప్రాణాధారం , ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సముద్ర నౌకాయానం అంతే కీలకమైన జీవనాధారం . భూగోళం మీద ఒక జీవి జీవించాలంటే జలం అవసరం, అలాగే ఒక దేశం ఆర్థికంగా పరిపుష్టి చెందాలన్నా, పౌరుల అవసరాలు తీరాలన్నా అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు సజావుగా సాగాలి. దేశం ఎంత స్వీయ సమృద్ధి సాధించినా ..ఉత్పత్తి చేసిన వస్తువుల ఎగుమతి కి నౌకాయానం కావలసిందే …! ప్రస్తుతం పశ్చిమాసియాలో, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి పై ఆధిపత్యం కోసం అమెరికా ..ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఘర్షణ.. ఇరు దేశాలు జారీ చేస్తున్న హెచ్చరికలు ప్రపంచ శాంతిని, ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మనం నివసిస్తున్న ఈ భూగోళంలో దాదాపు 70% పైగా జలభాగం ఉంది. సముద్రాలే ఖండాల మధ్య వారధులుగా నిలుస్తున్నాయని చరిత్ర చెబుతుంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 80% వాటా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. తక్కువ ఖర్చుతో, భారీ పరిమాణంలో వస్తువులను చేరవేయడానికి నౌకాయానాన్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు.
నీరు లేకపోతే జీవం ఎలా అంతరిస్తుందో, సముద్ర మార్గాలు మూసుకుపోతే ఆధునిక జీవనశైలి అలానే స్తంభించిపోతుంది. ఆహార ధాన్యాలు, ముడి చమురు, ఖనిజాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు – ఇలా ప్రతిదీ సముద్ర కెరటాల మీద ప్రయాణించి మన చెంతకు చేరుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని భౌగోళిక ప్రాంతాలు “చోక్ పాయింట్స్” గా మారాయి. అందులో
1. ఆసియా దేశాలైన చైనా, జపాన్, దక్షిణ కొరియాలకు వెళ్లే చమురు మరియు సరుకు రవాణాలో దాదాపు 25% మలక్కా జలసంధి ద్వారానే జరుగుతుంది.ఇక్కడ సముద్రపు దొంగల భయం ఎక్కువ. ఈ మార్గం మూసుకుపోతే నౌకలు ఆస్ట్రేలియా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వొస్తుంది, దీనివల్ల ఖర్చు మరియు సమయం భారీగా పెరుగుతాయి.
2.ఐరోపా మరియు ఆసియా మధ్య ప్రయాణించే నౌకలకు సూయజ్ కాలువ అతి తక్కువ దూరమున్న మార్గం. ఇది లేకపోతే నౌకలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి కేప్ అఫ్ గుడ్ హోప్ వెళ్లాలి. 2021లో ‘ఎవర్ గివెన్’ అనే నౌక ఇక్కడ చిక్కుకుపోయినప్పుడు ప్రపంచ వాణిజ్యం రోజుకు బిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
3. సూయజ్ కాలువ ద్వారా ప్రయాణించే ప్రతి నౌక బాబ్-ఎల్-మండేబ్ జలసంధి గుండా వెళ్లాల్సిందే. ఇది చమురు మరియు సహజ వాయువు రవాణాకు కీలక మార్గం. యెమెన్ యుద్ధం మరియు ప్రాంతీయ అస్థిరత వల్ల ఈ మార్గంలో నౌకలకు నిరంతరం ముప్పు పొంచి ఉంటుంది.
4. పనామా కాలువ అట్లాంటిక్ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే కీలక మార్గం. అమెరికా తూర్పు మరియు పశ్చిమ తీరాల మధ్య ప్రయాణించే నౌకలకు ఇది ప్రాణధారం. ఇది సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉండడం వల్ల ‘లాక్ సిస్టం’ ద్వారా నౌకలను దాటిస్తారు. ప్రస్తుతం ఇక్కడ నీటి కొరత కారణంగా నౌకల రాకపోకలు నెమ్మదించడం ఆందోళన కలిగిస్తోంది.
5. బోస్పోరస్ మరియు డార్డనెల్లెస్ జలసంధులు ఆసియా మరియు ఐరోపా ఖండాల సరిహద్దులో ఉండి, నల్ల సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలుపుతాయి. రష్యా మరియు ఉక్రెయిన్ నుండి గోధుమలు,ఇతర ఆహార ధాన్యాలు మరియు చమురు ఎగుమతులకు ఇది ఏకైక మార్గం. వీటిపై టర్కీకి పూర్తి నియంత్రణ ఉంటుంది, యుద్ధ సమయాల్లో నౌకల రాకపోకలను నియంత్రించే అధికారం టర్కీకి ఉంది.
హార్మోజ్ జలసంధి: ప్రపంచ ఇంధన నాడి
పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ను కలిపే ఈ చిన్న సముద్ర మార్గం, ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో దాదాపు 20 నుంచి 30 శాతం వరకు ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ వంటి దేశాల ఎగుమతులు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ భౌగోళికంగా పైచేయి కలిగి ఉంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటామని లేదా జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తరచుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ ఇంధన భద్రతపై నేరుగా ప్రభావం చూపే అంశం. ఒకవేళ ఈ మార్గం మూసుకుపోతే, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి, ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయి.
మానవ శరీరానికి రక్తం ఎట్లనో , ప్రపంచానికి చమురు అలాటిది. రక్తం సరఫరా ఆగిపోతే ప్రాణం పోతుంది. అలాగే హార్మోజ్ వంటి జలసంధుల ద్వారా చమురు సరఫరా ఆగిపోతే ప్రపంచ యంత్రం ఆగిపోతుంది. నదులు భూమిని సారవంతం చేసి పంటలు పండిస్తాయి. సముద్ర మార్గాలు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించి సంపదను సృష్టిస్తాయి. నీటి కోసం యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నట్టే, ఈ కీలక జలసంధులపై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేంత ప్రమాదకరమైనది.
ఇరాన్ తనపై ఉన్న పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలను ఎదిరించడానికి హార్మోజ్ జలసంధిని ఒక ఆయుధంగా వాడుకుంటోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఈ జలసంధిలో నౌకలకు ‘ట్రాన్సిట్ ప్యాసేజ్’ హక్కు ఉంటుంది. అంటే, ఏ దేశమైనా శాంతియుతంగా ఈ మార్గాన్ని వాడుకోవొచ్చు. కానీ, ఇరాన్ తన ప్రాదేశిక జలాల సాకుతో నౌకలను స్వాధీనం చేసుకోవడం లేదా బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. దీనికి ప్రతిచర్యగా అమెరికా వంటి దేశాలు తమ నౌకాదళాన్ని అక్కడ మోహరిస్తున్నాయి. ఈ “కత్తి మీద సాము” లాంటి పరిస్థితి ఎప్పుడు ఏ ప్రమాదానికి దారితీస్తుందోనని ప్రపంచం భీతిల్లుతోంది.
జీవకోటికి నీరు ప్రకృతి ప్రసాదించిన వరం అయితే సముద్రం ద్వారా నౌకాయానం మానవజాతి అభివృద్ధికి రహదారి. ఒకరి స్వార్థం కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రహదారులను అడ్డుకోవడం అంటే మానవ వికాసాన్ని వెనక్కి నెట్టడమే. హార్మోజ్ జలసంధి వివాదం కేవలం ఇరాన్ మరియు అమెరికా మధ్య సమస్య కాదు. ఇది ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత. జలం లేనిదే జీవం లేదు, సజావుగా సాగే నౌకాయానం లేనిదే ఆధునిక నాగరికతకు మనుగడ లేదు. వివాదాలను దౌత్యపరంగా పరిష్కరించుకుని, సముద్ర మార్గాలను అందరికీ అందుబాటులో ఉంచడమే ప్రపంచ దేశాల ముందున్న ఏకైక మార్గం. శాంతియుత నౌకాయానమే రేపటి ప్రపంచ ప్రగతికి,దేశాల ఆర్థిక పరిపుష్టికి అసలైన రహదారి..!