సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ

కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు
మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణం
గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం
ప్రజలకు మరింత మెరుగైన సేవలే ల‌క్ష్యం
రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 31 : ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలను అందించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించడం (రీఆర్గనైజేషన్)తో పాటు కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో సీఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మించబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డితో కలిసి రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి జ్యోతి బుద్ధప్రకాష్ పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వారికి మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా ఈ రెండు అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ, కొత్త బిల్డింగ్ ల నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు గంటల తరబడి చెట్ల కింద వేచి చూసే పరిస్థితి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని ఇందుకు అవసరమైన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వాటిలో 37 మాత్రమే సొంత భవనంలో ఉన్నాయని మిగిలినవన్నీ అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయని ఈ పరిస్థితిని మార్చడానికి అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో దశలవారీగా నిర్మిస్తామ‌న్నారు.

మొదటి దశలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరువు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ లో, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీలో, గండిపేట, శేరిలింగంపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం, మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మిస్తున్నామని ఈ నెలలోనే దీనికి శంకుస్థాప‌న జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఒక మోడల్ గా ఉంటుందన్నారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, గోల్కొండ మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను షేక్ పేట్ ప్రాంతంలో ఒకేచోట నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.

మొదటి దశలో నిర్మించే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీసం మూడు ఎకరాల్లో ఉంటుందని 10 నుంచి 15వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో  భవన నిర్మాణం ఉంటుందని వెయిటింగ్ హాల్‌, తాగునీటి సదుపాయం, విశాలమైన పార్కింగ్ వంటి వసతులు ఉండేలా డిజైన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సమర్థవంతమైన సేవలు లభిస్తాయని చెప్పారు.

ఇంటి గ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడడమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుందని అవినీతిని కూడా తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పనిభారం సమానంగా ఉండడంతో పాటు దస్త్రాల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుందన్నారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను తక్షణమే రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *