“ఈ ఇతిహాసాల సందేశం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా ఎంతో ప్రాసంగికం. ఈరోజు మనం రాజ్యాల కాలంలో లేము. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వ వ్యవస్థీకృత పాలనలో జీవిస్తున్నాము. అయినప్పటికీ సమాజం స్థిరంగా ఉండాలంటే బాధ్యతాయుతమైన, స్పందించే, దూరదృష్టి గల నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో పదవి మాత్రమే నాయకత్వాన్ని నిర్ధారించదు. ఆ పదవిని నిర్వహించే వ్యక్తి ధర్మబద్ధంగా వ్యవహరించడమే అసలు నాయకత్వం.”

భారతీయ సంస్కృతిలో నాయకత్వం (Leadership) అనే భావన కొత్తది కాదు. వేల సంవత్సరాల క్రితం రచించబడిన వాల్మీకి రామాయణం మరియు వ్యాస మహాభారతం వంటి ఇతిహాసాలు కేవలం ఆధ్యాత్మిక, నైతిక గ్రంథాలు మాత్రమే కాకుండా, సమాజ పరిపాలన, ధర్మం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై లోతైన మార్గదర్శకత్వాన్ని అందించిన మహత్తర గ్రంథాలు. ఈ ఇతిహాసాలలో కనిపించే కొన్ని సందర్భాలు, అసలుసిసలైన నాయకుడు ఉన్నప్పుడు సమాజం ఎలా వికసిస్తుందో, నాయకుడు లేకపోయినా, వున్ననాయకుడు సరైనవాడు కాకపోయినా, ఎలా సంక్షోభంలో పడుతుందో స్పష్టంగా తెలియజేస్తాయి.
శ్రీరామాయణం అయోధ్య కాండలో దశరథ మహారాజు మరణించిన తరువాత అయోధ్యలో నెలకొన్న పరిస్థితిని వర్ణిస్తూ, రాజ్యానికి నాయకుడు లేకపోతే సమాజం ఎదుర్కొనే సమస్యలను మహర్షులు వివరించిన తీరు నాయకత్వ ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. రాజు లేకపోతే ప్రకృతి సైతం సహకరించదని, వ్యవసాయం సరిగ్గా జరగదని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని, రైతులు పంటలు వేయడానికి సంకోచిస్తారని, వ్యాపారులు దూర ప్రయాణాలు చేయడానికి భయపడతారని, ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుందని, చట్టం న్యాయం బలహీనపడి, సమాజంలో అవినీతి, అన్యాయం, అస్థిరత పెరుగుతాయని వారు హెచ్చరించారు.
రాజ్యాన్ని కాపాడే బాధ్యత గల నాయకుడు లేకపోతే ప్రజల దైనందిన జీవితం సైతం ప్రభావితం అవుతుంది. స్త్రీలు భయంతో సింగారించుకోవడం మానేస్తారు. ప్రజలు సాయంకాలం సంతోషంగా విహరించలేరు. పండుగలు, ఉత్సవాలు, యాత్రలు నిలిచిపోతాయి. అధికారులు న్యాయం చేయకుండా లంచాలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా నాయకత్వం లేని పరిస్థితి క్రమంగా ఒక సమాజాన్ని అస్తవ్యస్తానికి నెట్టేస్తుందని వివరిస్తారు.
ఈ ఆలోచనలను మరింత స్పష్టంగా తెలియజేసే మరో సందర్భం భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కనిపిస్తుంది. అతడు నగరంలోని నిశ్శబ్దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఒకప్పుడు జీవంతో కళకళలాడిన అయోధ్య ఇప్పుడు వెలవెలబోతుంది. ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించదు. దేవాలయాల్లో పూజలు లేవు, ఇళ్లలో వంటల వాసన లేదు, తోటలు నిర్జీవంగా కనిపిస్తాయి. ఈ వర్ణన ఒక నాయకుడి లేకపోవడం సమాజపు మానసిక స్థితిని కూడా ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది.
ఇదే భావన మహాభారతంలోని విరాటపర్వంలో కూడా కనిపిస్తుంది. అజ్ఞాతవాసంలో వున్న పాండవుల ఉనికి తెలుసుకోవడానికి, వారిని వెతుకుతున్న సందర్భంలో భీష్ముడు ధర్మరాజు గుణగణాలను వివరించేటప్పుడు, ఒక నిజమైన నాయకుడు ఎక్కడ ఉంటాడో అక్కడి ప్రజల స్వభావం ఎలా మారుతుందో చెప్పాడు. ధర్మరాజు ఉన్న చోట ప్రజలు సత్యవంతులు, దయాశీలులు, న్యాయపరులు అవుతారు. వారు మంచి పనులు చేస్తారు, శాస్త్రాలను గౌరవిస్తారు, ఇతరులకు సహాయం చేస్తారు. సమాజంలో నైతిక విలువలు పెరుగుతాయి. భీష్ముడు చెప్పిన ప్రకారం ఒక నాయకుడి వ్యక్తిత్వం సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మంచి నాయకుడు ఉంటే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, పశుసంపద పెరుగుతుంది, ప్రజలు సంతోషంగా జీవిస్తారు. ప్రజల ప్రవర్తనలో కూడా నాయకుడి గుణగణాల ప్రతిబింబం కనిపిస్తుంది. ఇది నాయకత్వం కేవలం అధికారంతో సంబంధం ఉన్న విషయం కాదని, అది ఒక నైతిక శక్తి (Moral Force) అని తెలియజేస్తుంది.
ఈ ఇతిహాసాల సందేశం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా ఎంతో ప్రాసంగికం. ఈరోజు మనం రాజ్యాల కాలంలో లేము. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వ వ్యవస్థీకృత పాలనలో జీవిస్తున్నాము. అయినప్పటికీ సమాజం స్థిరంగా ఉండాలంటే బాధ్యతాయుతమైన, స్పందించే, దూరదృష్టి గల నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో పదవి మాత్రమే నాయకత్వాన్ని నిర్ధారించదు. ఆ పదవిని నిర్వహించే వ్యక్తి ధర్మబద్ధంగా వ్యవహరించడమే అసలు నాయకత్వం.
రాజా దశరథుడు మరణించిన తరువాత అయోధ్య రాజసభలో జరిగిన చర్చలను వర్ణిస్తూ వాల్మీకి రామాయణం మనకు అందించే సందేశం, సమాజాన్ని నిలబెట్టే నాయకత్వ ప్రాముఖ్యతపై శాశ్వతమైన ఆలోచనలకు దారి తీస్తుంది. రాజ్యానికి నాయకత్వం లేకపోతే, లేదా అధికారంలో ఖాలీ ఏర్పడితే సమాజంపై దాని ప్రభావం ఎంత తీవ్రమవుతుందో అయోధ్యలో కలిసిన విజ్ఞానవంతులైన మహర్షులు గంభీరంగా హెచ్చరిస్తారు. అధికార (నాయకత్త్వ) శూన్యత ఎక్కువకాలం కొనసాగలేదని, అది సమాజంలో అస్థిరతకు, భయానికి, అవ్యవస్థకు కారణమవుతుందని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు, ప్రజల విశ్వాసం, పరిపాలనా స్థిరత్వం అన్నీ సమర్థవంతమైన నాయకత్వంపై ఆధారపడి ఉంటాయని వారి ఆలోచనలు తెలియజేస్తాయి.
వాల్మీకి రామాయణంలో ఈ ఆలోచనలు రాజ్యపాలన సందర్భంలో వ్యక్తమైనప్పటికీ, వాటి అంతర్భావం రాజరిక వ్యవస్థను దాటి విస్తృతమైన నాయకత్వ సూత్రాన్ని సూచిస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలలో కూడా సమాజ స్థిరత్వాన్ని కాపాడటానికి సమర్థమైన, బాధ్యతాయుతమైన, ప్రజల కష్టాలకు స్పందించే, అప్రమత్తంగా వ్యవహరించే నాయకత్వం అత్యవసరం. భారతీయ ప్రజాస్వామ్య నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాకుండా సమాజాన్ని సమగ్రంగా నడిపించే నైతిక శక్తి నాయకత్వంలో ఉండాలి. నాయకుడి వ్యక్తిత్వం సమాజ నైతిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందనే భావన మహాభారతంలోని విరాటపర్వంలో కూడా స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది.
రామాయణంలోని ఈ సందేశం మరో ముఖ్యమైన ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. నాయకత్వం రూపంలో మాత్రమే ఉండి, ఆత్మలో లేకపోవడం. పాలకులు అధికారంలో ఉన్నప్పటికీ వారు న్యాయాన్ని కాపాడటంలో, సమాజాన్ని రక్షించటంలో విఫలమైతే, ఆ పరిస్థితి పాలన లేకపోవడానికే సమానమవుతుంది. అధికార స్థానాలు నిండి ఉన్నప్పటికీ పరిపాలనా ధర్మం లేకపోతే సమాజంలో నమ్మకం తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో నాయకత్వం ఉన్నట్టే కనిపించినా, వాస్తవానికి అది సమాజానికి దిశ చూపలేని బలహీన స్థితిలోకి జారిపోతుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నాయకత్వ నిర్లక్ష్యం మరో రూపంలో కనిపించవచ్చు. నాయకులు ప్రజల అవసరాలను పట్టించుకోకపోయినప్పుడు, అన్యాయంపై స్పందించడంలో విఫలమైనప్పుడు, లేదా సమాజంలో ఉన్న అసమానతలను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ నిర్లిప్తత స్పష్టమవుతుంది. ప్రజాసేవకులు తమ బాధ్యతా భావాన్ని కోల్పోతే పరిపాలనకు ఉన్న నైతిక ఆధిక్యం క్రమంగా తగ్గిపోతుంది. అప్పుడు ప్రజలకు ప్రభుత్వ సంస్థలు సమాజ హితానికి కాకుండా కొద్దిమంది ప్రయోజనాలకే పనిచేస్తున్నాయన్న అనుమానం కలుగుతుంది. ఈ పరిస్థితి ప్రజల విశ్వాసాన్ని బలహీనపరచి, ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రాణశక్తినే దెబ్బతీయగలదు.
అయోధ్యలో మహర్షులు వ్యక్తం చేసిన ఆలోచన, ధర్మబద్ధమైన అధికారం లేకపోతే అవినీతి విస్తరిస్తుందని, అధికారులు న్యాయం చేయడం కంటే లంచాలు స్వీకరించే పరిస్థితి ఏర్పడవచ్చని చేసిన హెచ్చరిక, నేటి పరిపాలనలో కనిపిస్తున్న అవినీతి, అధికార దుర్వినియోగం వంటి సమస్యలను స్పష్టంగా గుర్తు చేస్తుంది. ప్రజాస్వామ్యం బలమంతా కేవలం ఎన్నికలలోనే లేదని, ప్రజల సంక్షేమం పట్ల నైతిక నిబద్ధతలో ఉందని ఈ సందేశం తెలియజేస్తుంది. అధికారంలో ఉన్నవారికి శక్తి ఉన్నప్పటికీ దాన్ని సమర్థంగా వినియోగించే సామర్థ్యం, వివేకం, ధైర్యం లేకపోతే పరిపాలన సున్నితంగా, అస్థిరంగా మారుతుంది.
వాల్మీకి రామాయణంలో పేర్కొన్న ఉదాహరణలు ఒక ముఖ్యమైన సత్యాన్ని వెల్లడిస్తాయి: నాయకత్వం అనేది కేవలం అధికార స్థానం కాదు. సామర్థ్యం, బాధ్యతల సమ్మేళనం. అయోధ్య సభలో జరిగిన చర్చలలో గోచరించిన అత్యంత లోతైన భావన, మంచి నాయకత్వం సమాజానికి కనిపించని ఒక భరోసాను అందిస్తుంది. పరిపాలన స్థిరంగా, న్యాయంగా ఉన్నప్పుడు ప్రజలు భయభ్రాంతులు లేకుండా తమ జీవనోపాధులను కొనసాగిస్తారు. పండుగలు జరుపుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. విద్యాభ్యాసం కొనసాగిస్తారు. వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తాయి. సాధారణ జీవనం వికసించడానికి అవసరమైన ఆ నిశ్శబ్ద భద్రతే నిజమైన నాయకత్వం కలిగించే మహత్తర ఫలితం.
మహాభారతంలోని విరాటపర్వ ఘట్టం ఒక గంభీరమైన సూత్రాన్ని వెల్లడిస్తుంది. నాయకత్వం అనేది కేవలం అధికారాన్ని వినియోగించడం మాత్రమే కాదు. అది సమాజ స్వభావాన్ని మలిచే ఒక నైతిక శక్తి. నాయకత్వం లేకపోతే సమాజంలో అవ్యవస్థ పెరుగుతుంది. అదే సద్గుణాలతో కూడిన నాయకత్వం ఉన్నప్పుడు సమాజ నైతిక వాతావరణం మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. పాలకుని వ్యక్తిత్వం ప్రజల ప్రవర్తనలో ప్రతిఫలిస్తుంది. నాయకుడి ధర్మబద్ధమైన స్వభావం ప్రజల జీవనశైలిని, సమాజ శ్రేయస్సును, దేశాభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. నాయకుడి గుణగణాలు సమాజం మొత్తం మీద ప్రతిధ్వనించే శక్తిగా మారుతాయి.
రామాయణం, మహాభారతం అందించే ఈ రెండు దృక్కోణాలను కలిపి పరిశీలిస్తే, పరిపాలనకు సంబంధించిన ఒక శాశ్వత సూత్రం స్పష్టమవుతుంది. నాయకత్వాన్ని కేవలం అధికార స్థానం ఆధారంగా కాకుండా, న్యాయాన్ని కాపాడగల సామర్థ్యం, ప్రజల్లో విశ్వాసం కలిగించే శక్తి, సామూహిక సంక్షేమాన్ని ప్రోత్సహించే నిబద్ధత ఆధారంగా అంచనా వేయాలి. అయోధ్యలోని మహర్షులు ఒక దేశ స్థిరత్వం తెలివైన, ధర్మనిష్ఠ గల నాయకులు సమయానికి ముందుకు రావడంపై ఆధారపడి ఉంటుందని గుర్తించారు. పరిపాలన అనేది కేవలం రాజకీయ వ్యవస్థ కాదనీ, అది సమాజాన్ని దారితీసే వ్యక్తులపై నిక్షిప్తమైన ఒక నైతిక బాధ్యతనీ వారి ఆలోచనలు మనకు గుర్తు చేస్తాయి.
ఈ కారణంగా రామాయణంలో కనిపించే ఆ కథనం నేటి ప్రజాస్వామ్య నాయకత్వంపై జరుగుతున్న చర్చలకు కూడా వెలుగు నింపుతుంది. మంచి పరిపాలనను నిలబెట్టే గుణగణాల గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది. నిజాయితీ, అప్రమత్తత, కరుణ, సామర్థ్యం, ప్రజల సంక్షేమం పట్ల నిజమైన నిబద్ధత వంటి విలువలు మంచి నాయకత్వానికి ఆధారం కావాలి. నాయకుడి వ్యక్తిగత స్వభావం కేవలం పరిపాలనా నిర్ణయాలపై మాత్రమే కాకుండా, అతడు పాలించే సమాజంలోని నైతిక వాతావరణంపైన కూడా గాఢమైన ప్రభావం చూపుతుంది.
అయోధ్య మహర్షుల ఆలోచనలు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా తెలియజేస్తాయి. నాయకత్వం అనేది కేవలం ఒక పాలకుడు అధికారంలో ఉండడమే కాదు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి పదవులు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ అసలు ప్రశ్న పదవి నిండుతనంతో కూడి వున్నదా, లేదా అనేదే. ఆ పదవిలో ఉన్న వ్యక్తి నిజమైన, సమర్థమైన, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని అందిస్తున్నాడా అనే విషయమే ముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో నాయకత్వ మార్పులు ఎన్నికల ద్వారా గానీ, రాజ్యాంగ ప్రక్రియల ద్వారా గానీ, రాజకీయ పార్టీల అంతరంగిక పరిణామాల ద్వారా గానీ జరుగుతుంటాయి.
కొన్నిసార్లు ఈ మార్పులు ఒక పార్టీ నుండి మరొక పార్టీ అధికారంలోకి రావడంతో సాఫీగా జరుగుతాయి. మరికొన్నిసార్లు అంతర్గత పోటీలు, వ్యూహాత్మక కదలికలు, రాజకీయ లెక్కలు వంటి కారణాల వల్ల రూపుదిద్దుకుంటాయి. అలాంటి సమయంలో ఒక దేశానికి ప్రభుత్వం ఉన్నట్టే కనిపించినా, నాయకత్వ స్ఫూర్తి బలహీనంగా లేదా అనిశ్చితంగా కనిపించే పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి సందర్భాల్లో కేవలం అధికార పదవులు ఉండడం మాత్రమే పరిపాలనలో స్పష్టత, నిర్ణయాత్మకత లేదా నైతిక ఆధిక్యాన్ని హామీ ఇవ్వదు. నాయకత్వం సంస్థలకు దిశ చూపాలి, ప్రజలకు ధైర్యం కలిగించాలి, అనిశ్చిత పరిస్థితుల్లో సమాజాన్ని నడిపించాలి. అలా చేయకపోతే ప్రజల విశ్వాసం తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. సంస్థల ప్రభావశీలత కూడా క్రమంగా క్షీణిస్తుంది.
ఈ లోతైన సత్యాన్ని అయోధ్య మహర్షులు సహజంగా గ్రహించారు. రాజ్యంలో శాంతి, స్థిరత్వం నిలవాలంటే చురుకైన, బాధ్యతాయుతమైన, ధర్మబద్ధమైన నాయకత్వం అవసరమని వారి ఆందోళన సూచించింది. ఈ భావన నేటి ప్రజాస్వామ్య సమాజాల్లో కూడా సమానంగా ప్రాసంగికమే. నాయకత్వానికి నిజమైన చట్టబద్ధత కేవలం పదవిని ఆక్రమించడం వల్ల కాకుండా, ఆ పదవికి సంబంధించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం వల్లే లభిస్తుంది. అందువల్ల భారతీయ ఇతిహాసాలు సమాజానికి గుర్తు చేస్తున్న సందేశం: నాయకత్వాన్ని పదవి ఆధారంగా కాకుండా, సమాజ స్థిరత్వాన్ని కాపాడగల శక్తి, న్యాయాన్ని నిలబెట్టే ధర్మబద్ధత, ప్రజల సామూహిక శ్రేయస్సుకు సేవచేసే నిబద్ధత ఆధారంగా అర్థం చేసుకోవాలి.
అందుకే ప్రజాస్వామ్య పరిపాలనలో, అయోధ్య సభలో ఉన్న మహర్షుల మాదిరిగా, అనుభవజ్ఞులైన రాజనీతిజ్ఞుల, పండితుల, న్యాయవేత్తల, పరిపాలనారంగ సలహాదారుల, నిర్ణయ ప్రక్రియకు దోహదపడే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయ వ్యవస్థలు శతాబ్దాల పాటు మారుతూ వచ్చినా, పరిపాలనకు సంబంధించిన మౌలిక సూత్రాలు మాత్రం స్థిరత్వాన్ని కోల్పోలేదు. రామాయణం, మహాభారతం అందించే సందేశం ఆధునిక ప్రజాస్వామ్యాలకు ఒక స్పష్టమైన పాఠం. సమాజ సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న నైతిక, బాధ్యతాయుత, జ్ఞానవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే స్థిరమైన పరిపాలన సాధ్యమవుతుందన్న మార్గదర్శకత్వం. ఇతిహాసాల ఆలోచనలు భారతీయ నాగరికతలో నాయకత్వంపై లోతైన, నిరంతరమైన భావ పరంపర.
ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఉండవచ్చు, కానీ నాయకత్వం, ఆత్మ లేకపోవచ్చు. అధికారంలో ఉన్నవారు ప్రజల అవసరాలను పట్టించుకోకపోతే, అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోతే, పరిపాలనలో నైతికత తగ్గిపోతుంది. అప్పుడు ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతారు. సంస్థలు ప్రజల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్న భావన కలుగుతుంది.





