పిల్లల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం
పిల్లలు ఒక దేశానికి భవిష్యత్తు, రేపటి పౌరులు. వారు ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా, విలువలతో పెరిగితేనే సమాజం వికాస పథంలో పయనిస్తుంది. చిన్నారుల సంరక్షణ అనేది కేవలం కుటుంబ కర్తవ్యం కాదు; సమాజం, ప్రభుత్వం, అంతర్జాతీయ సమాఖ్యల వరకు ప్రతి ఒక్కరి భాధ్యత. బాల్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే భవిష్యత్తు తరాలను బలహీన పరచడం. అందువల్ల పిల్లల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అత్యవసరమని చరిత్ర, సంఘటనలు, గణాంకాలు మళ్ళీ మళ్ళీ మనకు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల హక్కులను రక్షించేందుకు పిల్లలకు జీవన హక్కు, అభివృద్ధి హక్కు, రక్షణ హక్కు, పాల్గొనుట హక్కు అనే నాలుగు ప్రధాన హక్కులను బలంగా గుర్తించింది. ఈ ఆధారంతోనే ప్రపంచంలోని అనేక దేశాలు పిల్లల కోసం చట్టాలు, విధానాలు రూపొందించాయి.
భారత దేశంలో పిల్లల సంరక్షణకు స్వాతంత్ర్యం తర్వాత మరింత శ్రద్ధ కనబరచ బడింది. 1974లో తొలి “జాతీయ బాలల విధానం” రూపొందించ బడింది. 1986 జాతీయ విద్యా విధానం ద్వారా విద్యకు బలమైన పునాది వేసి, 2009లో విద్య హక్కు చట్టంను అమలు చేశారు. దాని ఫలితంగా 6 నుంచి 14 ఏళ్ల మధ్య ప్రతి చిన్నారి విద్యను రాజ్యాంగ హక్కుగా పొందాడు. 2001లో దేశ సాక్షరత శాతం 65% ఉండగా 2011 నాటికి అది 74%కు పెరిగింది. అయితే ఇంకా 2021 గణాంకాల ప్రకారం దాదాపు 3 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు.
ఆరోగ్య పరంగా కూడా పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. యునిసెఫ్ 2023 నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దేశంలోని 5 సంవత్సరాల లోపు పిల్లలలో 36% మందికి బరువు తక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 8 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపం, సంక్రమణ వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ICDS సేవలు, POSHAN అభియాన్, మధ్యాహ్న భోజన పథకం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది.

ఇక బాల కార్మికత్వం మరో పెను సమస్య. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ల మంది పిల్లలు కార్మికులుగా ఉన్నారు. భారతదేశం లోనే 1.3 కోట్ల మంది చిన్నారులు శ్రమలో నిమగ్నమై ఉన్నారని 2019 అంచనాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది విద్యా హక్కును కోల్పోతున్నారు. బాల్య వివాహాలు కూడా ఇంకా ఆగిపోలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 21% బాలికలు 18 ఏళ్లు నిండక ముందే వివాహం చేసుకుంటున్నారు. దీని వల్ల వారు విద్య, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అన్నింటినీ కోల్పోతున్నారు.
పిల్లలపై హింస, దౌర్జన్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. NCRB 2022 నివేదిక ప్రకారం ప్రతిరోజూ సగటున 150 పైగా చిన్నారులపై నేరాలు నమోదవుతున్నాయి. లైంగిక దాడులు, అపహరణలు, గృహ హింసలు ప్రధానమైనవే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 2012లో POCSO చట్టం అమలు చేసింది. కానీ చట్టాలు ఉన్నప్పటికీ అమలు లోపాలు, సమాజంలో అవగాహన కొరవడటం వల్ల చిన్నారుల భద్రత ఇంకా సందేహాస్పదంగానే ఉంది.
డిజిటల్ యుగం పిల్లలపై కొత్త ప్రభావాలను చూపుతోంది. టెలివిజన్, మొబైల్, ఇంటర్నెట్ వాడకం పెరగడంతో వారి శారీరక చురుకుదనం తగ్గుతోంది. సాంకేతిక వ్యసనాలు, సైబర్ ముప్పులు, మానసిక ఒత్తిడి సమస్యలుగా మారుతున్నాయి. ఒక తాజా సర్వే ప్రకారం భారతదేశంలోని పిల్లల్లో 20% మంది ఇంటర్నెట్ లేదా గేమింగ్ వ్యసనంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు WHO నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకునే యువతలో 15–19 ఏళ్ల వయసు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఇది మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అత్యవసరాన్ని సూచిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు పేదరికం, విద్యా లోపం, పోషకాహార సమస్యలతో బాధపడుతుంటే, పట్టణాల్లో అధిక పోటీ, ఒత్తిడి, సాంకేతిక వ్యసనాలు ప్రధాన సమస్యలుగా మారాయి. ఈ రెండు వాతావరణాలూ భిన్నమైనవే అయినప్పటికీ, ఫలితం మాత్రం ఒకటే పిల్లల భవిష్యత్తు సవాళ్లమయం కావడం. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణకు సమగ్ర దృష్టి అవసరం. తల్లిదండ్రులు ప్రేమ, ఆదరాభిమానాలు, సురక్షిత వాతావరణం కల్పించాలి. ఉపాధ్యాయులు జ్ఞానంతో పాటు విలువల విద్యనూ అందించాలి. ప్రభుత్వం పథకాల అమలులో పారదర్శకత పాటించి, చట్టాలను కఠినంగా అమలు చేయాలి. సమాజం పిల్లలను కాపాడే, వారిని ప్రోత్సహించే వాతావరణాన్ని ఏర్పరచాలి. పిల్లలు రేపటి దేశాన్ని తీర్చిదిద్దే శక్తి. ప్రతి చిన్నారి చిరునవ్వు మన సమాజపు నిజమైన సంపద. వారిని కాపాడటం, సంరక్షించడం అంటే మన భవిష్యత్తును కాపాడటమే. కాబట్టి పిల్లల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.
రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…9440595494





