మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు నోటీసులు

రూ.45.46 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆదేశం

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ‌బీఆర్‌ఎస్‌కు చెందిన నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌కి ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం షాక్‌ ఇచ్చారు. జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి కార్పొరేషన్‌ ‌నోటీసులు ఇచ్చింది. ఆర్మూర్‌ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన వ్యాపార సముదాయం.. బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌నోటీసులు ఇచ్చింది. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది. కాగా గతంలో జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, విద్యుత్‌ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్‌ ‌మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్‌ ‌మాల్ అద్దెను గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు.

సుమారుగా రూ.7.50 కోట్ల అద్దె బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ అధికారులను బెదిరిస్తూ వస్తున్నాడు. అలాగే తన షాపింగ్‌ ‌మాల్‌కి విద్యుత్‌ ‌బిల్లులు కూడా చెల్లించడం లేదు. ఇన్నిరోజులుగా అధికార బలంతో జీవన్‌రెడ్డి అద్దె బకాయిలు అడగడానికి వచ్చిన అధికారులపై చెలరేగిపోయాడు. ఈ సారి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రావడం, జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆర్టీసీ , విద్యుత్‌ అధికారులు రంగంలోకి దిగి జీవన్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి షాపింగ్‌ ‌మాల్‌కి విద్యుత్‌ ‌సరఫరా నిలిపివేశారు. షాపింగ్‌ ‌మాల్‌కి బకాయి ఉన్న నగదును వెంటనే చెల్లించాలని లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ, విద్యుత్‌ అధికారులు హెచ్చరించారు. అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మాల్‌కు గతంలో అధికారులు నోటీసులు అతికించి.. తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్‌ ఇన్‌‌ఫ్రా డెవలపర్స్ ‌ప్రైవేటు లిమిటెడ్‌ ‌బాధ్యులు అద్దె చెల్లించకపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డి మాల్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైక్‌లో ప్రకటించారు. మాల్‌లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు. 2013 జూన్‌1‌న బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం.. నిజామాబాద్‌ ‌జిల్లాలోని ఆర్మూర్‌ ‌బస్టాండ్ ‌సమీపంలో 7,059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్‌ ఇన్‌‌ఫ్రా డెవలపర్స్ ‌ప్రైవేటు లిమిటెడ్‌కు బిల్డ్ ఆపరేట్‌ ‌ట్రాన్స్‌ఫర్‌ ‌కింద 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. అయితే, 2017లో ఆ స్థలాన్ని ఆర్మూర్‌ ‌మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి టేకోవర్‌ ‌చేసుకొని జీవన్‌రెడ్డి మాల్‌, ‌మల్టీప్లెక్స్‌ను నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *