సిఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీ..
రాష్ట్ర ప్రజలను పట్టించుకునేదెవరు?
కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే హరీష్రావు ఆగ్రహం
రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలననే నడుస్తుందనీ, మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అంటూ కాంగ్రెస్ సర్కార్పై మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందనీ, ఊరూరా జనం తిరగబడుతున్నారనీ, ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవా)ని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటనీ, అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా?అని నిలదీశారు.
ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వొచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారన్నారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారిందనీ, సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందనానరు. మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా..ఆరు గ్యారెంటీలు అమలు దగా..రుణమాఫీ చేయడం దగా.. పంట బోనస్ ఇవ్వడం దగా..రైతు భరోసా అమలు దగా..రేషన్ కార్డుల జారీ దగా..ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా..అని ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.
మీరు చేసిన మోసాన్ని, నయవంచనను ప్రజలు తెలుసుకున్నారన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనీ, అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తున్నారనీ మండిపడ్డారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తుందనీ, అడుగడుగునా ప్రశ్నిస్తుందన్నారు. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతారనీ, ఎంత మందిని అరెస్టులు చేస్తారన్నారు. మీ రాక్షస పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవాలన్నారు. ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించాలనీ, ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాననీ ఆ ప్రకటనలో హరీష్రావు పేర్కొన్నారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే