దీప్తి మరెన్నో కీర్తిశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష
వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 2 : పారిస్లో జరిగిన పారాలింపిక్స్లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగల్లు ముద్దుబిడ్డ, పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. మానసిక సామర్థ్య సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ, కుంగిపోకుండా, విధిని ఎదిరించి తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి జీవాంజి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని మంత్రి సురేఖ అన్నారు. దీప్తి జీవాంజికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని మంత్రి తెలిపారు. దీప్తి మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవలే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్టస్ యూనివర్సిటీ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. సీఎం కప్ పేరుతో పోటీలు నిర్వహించి గ్రామీణుల్లో దాగిన ప్రతిభను వెలికితీస్తున్నామని అన్నారు. త్వరలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని తీసుకొచ్చి దేశంలోనే క్రీడల రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.



