ఎట్లుండే తెలంగాణ ఎట్లాయే..!

  • దవాఖానల్లో బెడ్ల కోసం పిల్లల పోటీ
  • గురుకులాల‌ పిల్లలను చూస్తే బాధేస్తోంది.. : కేటీఆర్‌

ఎట్లుండే తెలంగాణ.. ఎట్ల అయింది.. ముఖ్యంగా గురుకుల పిల్లలను చూస్తే బాధేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.  ఈ మేరకు కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చింది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలుతల్లిదండ్రులలో ఆవేదన రేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్‌ ‌పాలనలో ద‌వాఖాన‌ బెడ్లను ఎక్కించారని కేటీఆర్‌ ‌విమర్శించారు.

పదేళ్ల కేసీఆర్‌ ‌పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ పడితే ఏడాది కాంగ్రెస్‌ ‌పాలనలో హాస్పిట‌ళ్ల‌లో  బెడ్ల కోసం పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు.. గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి.. గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి అని కేటీఆర్‌ ‌సూచించారు. చివరకు ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *