తోపులాటలో ఇరుక్కపోయిన మంత్రి

ఎంతో శ్రమించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు

 స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం… లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, విప్‌ బీర్ల ఐలయ్య ఉన్నారు.
అయితే ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన సందర్భంగా పెద్దఎత్తు ఆయన అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సీఎంను చూసేందుకు ఎగబడ్డారు.  వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో తూర్పు గోపురం వద్ద పోలీసులు – కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ కూడా తూర్పుగోపురం వద్దకు వొచ్చారు. అంతలోనే తోపులాట చోటు చేసుకోవడంతో మంత్రి కూడా అందులో ఇరుక్కుపోవాల్సి వొచ్చింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక తోపులోటలో కాసేపు మంత్రి విలవిలలాడిపోయారు. చివరకు ఎలాగోలా పోలీసులు.. మంత్రి కొండా సురేఖను అక్కడి నుంచి బయటకు తీసుకువొచ్చారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాటతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తానికి కార్యకర్తలను అదుపు చేయడంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *