నాణ్య‌త లేని బ‌డులు…పెరుగుతున్న డ్రాపౌట్లు!!

అధిక జ‌నాభా శాపం అనుకునే రోజులు పోయి వ‌రం అనుకున్న రోజులు వొచ్చేశాయి. ఈ అధిక జ‌నాభాను ప్ర‌యోజ‌న‌క‌ర రీతిలో ఉప‌యోగించుకుంటే ప్ర‌పంచాన్నే శాసించే ప‌రిస్థితులు వొస్తాయ‌ని మ‌న పైత‌రాల‌ వారు బ‌హుశా క‌ల‌లో కూడా ఊహించి ఉండరు . అనుకున్న ప్ర‌యోజ‌నం సిద్ధించ‌డానికి అంద‌రూ విద్యావంతులైతేనే సాధ్యం. కానీ ప్ర‌స్తుత మ‌న విద్యావ్య‌వ‌స్థ ప‌నితీరు అందుకు భిన్నంగా తిరోగ‌మ‌నంలో ఉండటం  విచార‌క‌రం. భారతదేశం తన జనాభా సాంద్రతను ఒక వరంగా (Demographic Dividend) మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, గత దశాబ్ద కాలపు విద్యా గణాంకాలు ఒక భిన్నమైన, ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి.  UDISE Unified District Information System for Education గణాంకాల ప్రకారం 154కోట్ల జ‌నాభా పెరిగితే  స్కూలుకు వెళ్లే పిల్లల సంఖ్య 2.41కోట్లు త‌గ్గ‌డమే ఇందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌.  2015లో ప్ర‌తి వంద‌మందిలో 21 మంది బ‌డికి వెళితే ఈ సంఖ్య 2025 నాటికి 17కు ప‌డిపో యింది.

ఇదే ప‌రిస్థితి  కొన‌సాగితే ప్ర‌పంచ స్థాయి అవ‌స‌రాల‌కు త‌గిన నైపుణ్యం గ‌ల యువ‌త అందుబాటులో లేక‌పోవ‌డంతో దేశం అన్ని ర‌కాలుగా న‌ష్ట‌పోక త‌ప్పదు. జ‌నాభా సంఖ్య పెరిగిన‌ప్పుడు పాఠ‌శాల‌ల్లో ప్రవేశాల సంఖ్య త‌ద‌నుగుణంగా పెర‌గ‌క‌పోగా 19శాతం   క్షీణించ‌డం భావి ప్ర‌మాద సూచిక‌! దీనికితోడు పులిమీద పుట్ర‌లా 93వేల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మూత‌ప‌డ్డాయి. అదేమంటే విద్యార్థుల సంఖ్య త‌గినంత లేక‌పోవ‌డంతో స‌మీపంలోని పెద్ద పాఠ‌శాల‌లో విలీనం చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. దీనికి పెట్టిన అంద‌మైన పేరు “స్కూల్ రేష‌న‌లైజేష‌న్‌.  ఫ‌లితంగా వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో చ‌దువు విద్యార్థుల‌కు అందుబాటులో లేకుండా పోయింది. ముఖ్యంగా బ‌డుల‌కు వెళ్ల‌డానికి త‌గిన ర‌వాణా స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో, మ‌రోమార్గం లేక పిల్ల‌లు చ‌దువుకు స్వ‌స్తి చెబుతుండ‌టం వ‌ర్త‌మాన విషాదం.

ఒక‌ప‌క్క జ‌నాభా పెరుగుతుంటే మ‌రోప‌క్క బ‌డి మానేసేవారి సంఖ్య పెరుగుతూ పోతుండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌భుత్వ పాఠ‌శా ల‌ల్లో అర‌కొర మౌలిక స‌దుపాయాలతో పాటు వేధిస్తున్న ఉపాధ్యాయుల కొర‌త‌! దీన్ని సావ‌కాశం గా తీసుకొని తామ‌ర‌తంప‌ర‌గా ప్రైవేటు పాఠ‌శాల‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం వీటిల్లో విద్యార్థుల చేరికలు కూడా పెరిగాయి. కానీ ఇక్క‌డ న‌డ్డివిరిచే రీతిలో ఫీజుల‌భారం ఉండడంతో  భ‌రించ‌లేక చ‌దువు మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. నిజం చెప్పాలంటే కోవిడ్ త‌ర్వాత ప‌రిస్థితులు ద‌య‌నీయంగా మారాయి. ఆదాయం కోల్పోయిన సామాన్య కుటుంబాలు, ఆస‌రాకోసం త‌మ పిల్ల‌లను బ‌డి మాన్పించి ప‌నుల‌కు పంప‌డం మొదలైంది. దీంతో ప్రాథ‌మిక విద్య త‌ర్వాత డ్రాపౌట్ల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వొస్తుంది . దీనివ‌ల్ల రాబోయే కాలంలో దేశంలో పెరిగిన యువ‌శ‌క్తిలో త‌గిన నైపుణ్యాలు లేక‌పోవ‌డంతో నిరుద్యోగం పెరిగి, ఉత్పాద‌క‌త త‌గ్గిపోతుంది. ఈ ప్ర‌మాద‌ ఘంటిక‌ల‌ను కేంద్రం గుర్తించి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే రాబోయే త‌రాల జీవితాలు అంధ‌కార బంధురం కాక‌త‌ప్ప‌దు.

ఇక తెలంగాణ ప‌రిస్థితికి వొస్తే స‌మ‌స్య మ‌రో కోణంలో క‌నిపిస్తోంది. గురుకుల పాఠ‌శాల‌ల‌ను ఇబ్బ‌డిముబ్బ డిగా పెంచినా, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల న‌మోదు తగ్గ‌డం విచిత్రం! యూడీఐఎస్ ఈ 2024-25 తాజా నివేదిక‌ల ప్ర‌కారం రాష్ట్రం మొత్తంమీద విద్యార్థుల ప్ర‌వేశాలు 13% పెర‌గ‌డం ఆనందం క‌లిగించినా, ప్ర‌భుత్వ బ‌డుల్లో చేరేవారి సంఖ్య 9% త‌గ్గ‌డం, ప్రైవేటు బ‌డుల్లో ఏకంగా 35% పెర‌గ‌డం, ప్ర‌భుత్వ పాఠ‌శా ల‌ల నిప్ప‌చ్చ‌ర ప‌నితీరుకు అద్దం ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌లో (2245 స్కూళ్లు) దేశంలోనే రెండో స్థానంలో ఉన్న‌దంటే రాష్ట్రంలో ప్ర‌భుత్వ విద్య ద‌య‌నీయ‌స్థితి ఏ స్థాయిలో ఉన్న‌దో అర్థం చేసుకోవొచ్చు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప‌ర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) స్కోరు త‌గ్గ‌కుండా ఉండేందుకు   ఈ స్కూళ్ల‌ను యూడీఐఎస్ ఈ జాబితానుంచి తొల‌గించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  విషాద‌మేమంటే ఈ మొత్తం 2245 స్కూళ్ల‌లోని 1441 పాఠ‌శాలల్లో టీచ‌ర్లు, విద్యార్థులు లేరు! జాతీయ స్థాయితో పోల్చిన‌ప్పుడు తెలంగాణ‌లో బ‌డికి దూర‌మైన పిల్ల‌ల సంఖ్య త‌క్కువే. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో విద్యార్థుల సంఖ్య త‌గ్గినా ఈమేర‌కు ప్రైవేటు బ‌డుల్లో చేరిక‌లు 35% పెరిగాయి. ఇక 78% ప్ర‌భుత్వ బడుల్లో పిల్ల‌ల సంఖ్య వంద‌కంటే త‌క్కువ‌గా ఉంటున్నది . కోవిడ్ స‌మ‌యంలో ప్రైవేటు ఫీజుల భారం త‌ట్టుకోలేక 70.1% మంది ప్ర‌భుత్వ బ‌డుల్లో (2022) చేరారు. కానీ త‌ర్వాత  కాలంలో ఇది 59.8%కు ప‌డిపోవడానికి ప్రధాన కార‌ణం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ తీరు స‌క్ర‌మంగా లేక‌పోవ‌డ‌మేన‌ని వేరే చెప్పాల్సిన ప‌నిలేదు.
బ‌డుల్లో చేరిక‌లు, డ్రాపౌట్లు ఒక స‌మ‌స్య అయితే, చ‌దువుతున్న వారిలో త‌ర‌గ‌తికి త‌గిన విద్యా ప్ర‌మాణాలు లేక‌పోవ‌డం మ‌రో విషాదం. ఉదాహ‌ర‌ణ‌కు 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల్లో కేవ‌లం 41.1% మంది మాత్ర‌మే భాగ‌హారం చేయ‌గ‌లుగుతున్నారు. ఇదే త‌ర‌గ‌తికి చెందిన 56.4% మంది మాత్ర‌మే రెండో త‌ర‌గ‌తి పుస్త‌కాన్ని చ‌ద‌వగ‌లుగుతున్నారంటే, విద్యా ప్ర‌మాణాలు అట్ట‌డుగు కంటే దిగువ స్థాయికి ప‌డిపోయాయ‌ని అర్థం! తెలంగాణ మొత్తం జ‌నాభాలో 43.6% యువ‌కులే (15-40 మ‌ధ్య వ‌య‌స్కులు). వీరిలో త‌గిన నైపుణ్యాలు లేక‌పోవ‌డం వ‌ల్ల‌, నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వొస్తున్న‌ది. ఇప్ప‌డు దేశం రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఒక‌టి నిపుణుల కొర‌త కాగా రెండ‌వ‌ది నైపుణ్యంలేని యువ‌త‌! పాఠ‌శాల విద్య‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డం, విద్యా ప్ర‌మాణాల‌ను నిక్క‌చ్చిగా పాటించే విధానాలు ప్ర‌వేశ‌పెట్ట‌డం ఒక్క‌టే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *