- 14నుంచే రైతుభరోసా పంపిణీ
- రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే యోచన
- కేబినేట్ సబ్ కమిటీలో మరోమారు చర్చ
రైతు భరోసాపై చర్చించిన కేబినేట్ సబ్కమిటీ ఇక సాగురైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని కమిటీ అభిప్రాయపడింది. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశముంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న ప్రభుత్వం.. నాలుగో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబులు సభ్యులుగా ఏర్పాటైన ఉపసంఘం ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించింది. ఈ పథకం అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ.. గురువారం నాడు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి మంత్రివర్గ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎంతమేర భూమికి ఇవ్వాలి.. ఈ పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి జమ చేయాలి.. అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. అలాగే.. రైతు భరోసా కోసం రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఇక జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.




