- గత పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందేమీ లేదు
- దావోస్లో తెలంగాణకు భారీగా పెట్టుబుడులు
- పటాన్చెరు కాంగ్రెస్ వ్యవహారంపై విచారణ
- మీడియా సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బిఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని చెప్పారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దావోస్లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరింది. తెలంగాణ పెవిలియన్ రద్దీగా మారింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయి. మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.
ప్రజలను మభ్యపెట్టడం.. ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడమే భారాస పని. గత ప్రభుత్వ పాలనతో నెలకు రూ.ఆరున్నర వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. మంచి పనులు జరుగుతున్నప్పుడు ప్రశంసించడం నేర్చుకోండి. తాజాగా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులతో 50 వేల నుంచి 75 వేల ఉద్యోగాలు లభించే అవకాశముంది‘ అని మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. పెట్టుబడి పెట్టడానికి అనేక కంపెనీలు వస్తాయని.. అందులో మేఘా కృష్ణారెడ్డి కంపెనీ ఒకటన్నారు. పెట్టబడులపై ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం అంటూ మాజీ మంత్రి కేటీఆర్కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు.
సీఏం దావోస్ పర్యటన తెలంగాణకు ధమాకా అన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వొస్తాయని మరోసారి నిరూపితమైందని తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్పై నమ్మకం ఉందన్నారు. రైజింగ్ 2050 నినాదం గేమ్ చెంజర్గా మారిందన్నారు. తనకి తాను సుపర్ స్టార్గా చెప్పుకునే కేటీఆర్ పదేండ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్ల కాలంలో 27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు తెచ్చారని అన్నారు. కేసీఆర్కు విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ఇకపోతే కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటా.. నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెడతా ‘ అంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు.
గూడెం మహిపాల్ రెడ్డి మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొంత సమస్య ఉందని.. కమిటీ వేశామని.. కమిటీ అన్ని విషయాలపై అధ్యయనం చేస్తుందని పీసీసీ చీఫ్ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న అంశంపై కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గతంలో ఎమ్మెల్యేల ద్వారానే లబ్దిదారుల ఎంపిక జరిగిందని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలో పాత కొత్త ఇబ్బందులు ఉన్నాయన్నారు. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కమిటీ పరిశీలన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ వెల్లడించారు.




