- ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు
- సమయం కోరుతూ విచారణకు హాజరుకాలేనని లేఖ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో విచారణకు రావాల్సిందిగా మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అధికారు అరవింద్ కుమార్కు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే విచారణకు సంబంధించి ఈడీకి ఐఏఎస్ అధికారి తాజాగా లేఖ రాశారు. నేడు విచారణకు హాజరుకాలేనని లేఖలో అరవింద్ కుమార్ పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని ఐఏఎస్ అధికారి కోరారు. మరి అరవింద్ కుమార్ లేఖపై ఈడీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈడీ విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసును దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్కు బీఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు.
విచారణకు రావడానికి తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. బీఎల్ఎన్ రెడ్డి మెయిల్కు ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు చెప్పారు. మరోవైపు ఈనెల 7న హాజరుకావాల్సిందిగా మాజీ మంత్రి కేటీఆర్కు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే బీఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో మరి కేటీఆర్ కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. కాగా.. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అవకతవకలు జరిగాయని.. భారీగా నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని చేర్చుతూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఏసీబీ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఏసీబీ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానంలో కేటీఆర్కు ఊరట లభించింది. మొదటి రెండు సార్లు జరిగిన విచారణలో గత ఏడాది డిసెంబర్ 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. తాజాగా డిసెంబర్ 31న జరిగిన విచారణలో కేటీఆర్ను ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశిస్తూ.. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. అలాగే ఏసీబీ కేసుపై కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరం మొదటి రోజు ఈ కేసుపై మాట్లాడిన ఆయన న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని అన్నారు. న్యాయస్థాన తీర్పుపై తాను కూడా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ కేసు లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయాలని రేవంత్ సర్కార్ పట్టుబట్టి కూర్చుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.



