హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి విచారణ
నిధుల విడుదలకు అనుమతులపై ప్రశ్నలు
ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగింది. శుక్రవారం దాదాపు 6 గంటలుగా బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటిని బీఎన్ఎల్ రెడ్డి ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండీఏ బోర్డు ఖాతా నుంచి ఎఫ్ఈవోకు రూ.55 కోట్లు రిలీజ్ చేయడంలో బీఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ భావిస్తోంది. ఈ మేరకు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆదేశాలతోనే నగదు రిలీజ్ చేసినట్లు విచారణలో బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేశానని రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
ఇందులో తన సొంత ప్రయోజనాలు ఏమీ లేవని ఏసీబీ అధికారులకు బీఎల్ఎన్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఒకవైపు మంత్రి కేటీఆర్.. మరోవైపు పైఅధికారి వొత్తిడి వల్లే రూ.55 కోట్లకు సంబంధించి తాను ప్రొసీడింగ్స్ చేసినట్లు బీఎల్ఎల్ రెడ్డి విచారణలో చెప్పారు. నగదు బదిలీ చేస్తే భవిష్యత్తులో ఇరుక్కుపోతామని తనకు ముందే తెలుసని ఏసీబీ అధికారులకు బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయినా అప్పటి పరిస్థితుల వల్లే నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లాల్సి వొచ్చిందని చెప్పినట్లు సమాచారం. తాను ఏసీబీ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈడీ అడిగిన ప్రశ్నలనే మీరూ అడుగుతున్నారని ఏసీబీ అధికారులకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈడీ అడిగిన ప్రశ్నలన్నిటికీ తాను సమాధానమిచ్చానని, ఏసీబీ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది




