వారం రోజులుగా అండర్‌డ్రైనేజీలోనే..

కాలువ నుంచి శబ్దాలు రావడంతో గుర్తించిన స్థానికులు

ఒకటి కాదు, రెండు కాదు.. వారం రోజులు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో ఉన్నాడు ఓ వ్యక్తి. ఆ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలోకి అతను ఎలా వెళ్లా డు. వారం రోజులు అందులో ఎలా ఉన్నాడన్న విషయాలు అతనికి గుర్తులేదు. శుక్రవారం ఉదయం అండర్‌ డ్రైనేజీ నుంచి శబ్దాలు వినబడటం, అతని చేతి వేళ్లను గమనించిన స్థానికులు అత‌డిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌ మండలం అవుసులపల్లి గ్రామనికి చెందిన నాగారం మల్లేష్‌ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా కనిపించటం లేదు. దీనితో అతని కోసం అంతటా వెతికిన కుటుంబ సభ్యులు చివరకి పోలీస్‌ స్టేషన్లో పిర్యాదు చేసారు. అలాగే మల్లేష్‌ కనపడటం లేదని,పోస్టర్లు అతికించి, వివిధ వాట్సాప్‌ గ్రూప్‌లలో అతని ఫోటోను షేర్‌ చేసారు. అందువల్లే ఇతన్ని బయటకు తీసిన తర్వాత ఇతను ఎవరు అనే విషయన్ని తొందరగా గుర్తించారు.

అయితే మల్లేష్‌ గత వారం రోజుల క్రితం కుంభమేళాకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో నర్సాపూర్‌కు చేరుకున్నానంటూ కుటుంబీకులకు సమాచారం అందించి..  అనంతరం అదృశ్యమయ్యాడు. కాగా అప్పటి నుంచి వారం రోజులుగా కుటుంబీకులు మల్లేశం కోసం వెతక సాగారు. నేడు నర్సాపూర్‌ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అండర్‌ డ్రైనేజీ పైన గల సిమెంట్‌ పలకల మధ్యలో నుంచి చేతులు బయటకు పెట్టడంతో, గుర్తించిన స్థానికులు సురక్షితంగా బయటకు తీసి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు.

అయితే మల్లేశ్‌ను అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నుంచి బయటకు తీసిన స్థానికులు.. అతడ్ని పలు ప్రశ్నలు అడిగినా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. మతిస్థిమితం కోల్పోయినట్లు స్థానికులు భావిస్తున్నారు.  తాను కుంభమేళా నుంచి వచ్చానని, తనను ఎవరో వెంబడించారని అండర్‌ డ్రైనేజీలోకి తానే వెళ్ళానని అంటున్నాడు. వారం రోజులు తిండి, నీళ్లు లేకుండా డ్రైనేజీలో ఉన్న మల్లేష్‌కి మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *