‌త్వరలో రేషన్‌ ‌కార్డు ద్వారా 6 కిలోల సన్నబియ్యం

అర్హులైన చివరి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు
దరఖాస్తుల సమర్పణ తుది గడువు లేదు, తప్పుడు వార్తలు నమ్మొద్దు
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 22 : రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ‌కలెక్టర్‌ ‌సందీప్‌ ‌కుమార్‌ ‌ఝ లతో కలిసి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పాల్గొని మాట్లావడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 90 లక్షల తెల్ల రేషన్‌ ‌కార్డులు ఉన్నాయని, గత పదేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో రేషన్‌ ‌కార్డులు ఇవ్వలేదని, కేవలం 40 వేల కార్డులు మాత్రం అందించారని అన్నారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్‌ ‌కార్డు వొచ్చే వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా  రేషన్‌ ‌కార్డులు జారీ చేస్తున్నామని, ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తు చేసిన, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసినా, గ్రామ సభల్లో దరఖాస్తు ఇచ్చినా విచారించి అర్హత మేరకు కార్డులు మంజూరు చేస్తామన్నారు. గ్రామ సభలో  ప్రకటించే ప్రాథమిక జాబితాలో పేరు లేని పక్షంలో దరఖాస్తు సమర్పిస్తే అర్హతను పరిశీలించి రేషన్‌ ‌కార్డు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రజలు మండల కేంద్రాలు మున్సిపాలిటీలలో ఉన్న ప్రజాపాలన కేంద్రాలలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని మంత్రి పేర్కొన్నారు. నూతన రేషన్‌ ‌కార్డుల జారీ తర్వాత ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం  సరఫరా చేస్తామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో సాచురేషన్‌ ‌పద్దతిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మించామని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వొచ్చిన తర్వాత  మరోసారి ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభిస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే సొంత ఊరు కాబట్టి ఇక్కడ 100 శాతం అర్హులకు మొదటి దఫాలోనే ఇండ్లు మంజూరవుతాయని అన్నారు.  ప్రస్తుతం సొంత జాగా ఉండి ఇండ్లు లేని వారికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నామని, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి 6 లక్షల సహాయం అందజేయ బోతున్నామని అన్నారు. రైతు భరోసా కింద రైతులకు అందే సహాయం 20 శాతం పెంచి ఎకరానికి 12 వేల రూపాయలు అందజేస్తామని, వ్యవసాయ యోగ్యమైన భూమికి పంట వేసిన వేయకుండా రైతు భరోసా అందుతుందన్నారు. భూమిలేని కూలీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కూలీల కుటుంబాలకు 12 వేలు ఇస్తున్నామని తెలిపారు. ఈ నాలుగు పథకాలను గ్రామసభలు నిర్వహించే ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి జనవరి 26 నుంచి అమలు చేస్తామని, అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ,  గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జనవరి 26 నుంచి ప్రారంభించి అర్హత ప్రకారం రేషన్‌ ‌కార్డులను అందరికీ జారీ చేస్తామని అన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌మాట్లాడుతూ రుద్రంగి గ్రామ ప్రజలు తమ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించాలని చేసిన కృషి ఫలితంగా తాను నేడు ఎమ్మెల్యే అయ్యానని అన్నారు.  43 వేల 100 ఎకరాలకు సాగు నీరు అందించే రుద్రమ్మ ప్రాజెక్టు ను మొదటి ప్రాధాన్యత లో పెట్టామని, ఈ పనులను త్వరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ఆయన మంత్రిని విజ్ఞప్తి చేశారు. రుద్రంగి మండలం మానాల లో పాత చెరువు కొత్త చెరువుకు లిఫ్ట్ అం‌దించే త్రాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండవని, మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం అందించారు.

ప్యాకేజీ 9 లో మలక్‌ ‌పేట్‌ ‌రిజర్వాయర్‌ ‌లో టీఎంసి నీళ్లు నింపామని, 25 కోట్లు విడుదల చేస్తే అప్పర్‌ ‌మానేరు కు నీళ్లు తీసుకుని వెళ్లవచ్చని , ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని ప్రభుత్వ విప్‌ ‌కోరారు. వేములవాడ, తిప్పా పూర్‌, ‌కథలాపూర్‌ ‌బస్టాండ్‌ ఆధునికరణ కు నిధులు మంజూరు చేయాలని  రవాణా శాఖ మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్‌ ‌సందీప్‌ ‌కుమార్‌ ‌ఝ మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రుద్రంగి మండల కేంద్రంలో ప్రాథమికంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 103  , రైతు భరోసా క్రింద 1927 , నూతన రేషన్‌ ‌కార్డుల కోసం 802, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1375 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌నాగుల సత్యనారాయణ గౌడ్‌, ‌మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌లు, అదనపు కలెక్టర్‌ ‌ఖీమ్యా నాయక్‌, ఎస్పీ అఖిల్‌ ‌మహాజన్‌, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ ‌బేగం, ఏడీ మైన్స్ ‌క్రాంతి కుమార్‌,  ‌కో ఆపరేటివ్‌ ‌చైర్మన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి  పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *