ఒక బాంధవ్యానికి పాతికేళ్ళు. తెలుగు కథాపరిణామక్రమాన్ని దఖలు చేస్తుంది ఇదంతా. తెలుగు నేలలో ట్యాంక్ బండ్ తడి గడ్డి పరకలపైన, హైదరాబాద్ పాత చలిలా మొలకరించింది, చిలకరించింది, అవతరించింది రైటర్స్ మీట్. తెలుగు కథ విస్తరించడంలో విస్తరాకులు కుట్టింది, తోరణాలు కట్టింది, దీపధారులను అక్కున చేర్చుకొని కాగడాలకు తైలం దిద్దింది. జ్యోతి రగిల్చింది. కథా రచన కేవలం కార్యకలాపం కాదు, కళాకలాపం, సామాజిక సంభాషణ, రేపటి కలల్ని రూపు కట్టే దివిటీ అనే బాధ్యతనూ, మెళకువలనూ, కువకువలనూ, కుహూలనూ నేర్పిన శాల; నేర్పిన చైత్యం రైటర్స్ మీట్. ఒక రాజ్యం, ఒక పార్టీ, ఒక అకాడమీ, ఒక విశ్వవిద్యాలయం చేపట్టలేకపోయిన, చేపట్టి ఉండవలసిన కావ్యకలాపం, కార్యకలాపం రైటర్స్ మీట్. ఖదీర్, సురేష్ లతో పాటు ఈ పాతికేళ్ళలో, ఈ సైన్యంలో కథలు నూరినందుకు, కథలు ఊరేలా కదిలినందుకు, నేనందులో ఉన్నందుకు నాకు చాలా గర్వం.
-అనంతు




