ప్రచారంలో కేంద్రమంత్రి, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : బీఆర్ఎస్ పార్టీకి వోటు వేస్తే, అది మూసీ నదిలో వేసినట్టేనని కేంద్ర మంత్రి, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ అవినీతికి కేంద్రంగా మారడంతోనే ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కుటుంబ పాలనకు బిజెపి వ్యతిరేకమని ఆయన అన్నారు. శనివారం గుడిమల్కాపూర్ నుంచి మెహిదీపట్నం, పద్మనాభనగర్లో బైక్ర్యాలీ రోడ్షోను నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ… మూడోసారి నరేంద్ర మోదీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడు తున్న మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోదీ అని ఆయన కొనియాడారు. నాంపల్లి నియోజకవర్గంలో వోట్లు చీలకుండా ప్రజలంతా ఐక్యంగా ఉండి బీజేపీని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రచారంలో ఆయన వెంట బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి అన్నపురం రమేష్కుమార్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాహుల్చంద్ర, డివిజన్ అధ్యక్షులు ముఖేశ్, జనార్థన్రావు, విజయ్, బీజేపీ నాయకులు దేవర శ్రీనివాస్, దేవర తదితరులు ఉన్నారు.