- భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొ.యోగేంద్ర యాదవ్
- భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం : దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ నారాయణ
- విచ్ఛిన్నం చేసే శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు
హిమాయత్నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదే అని భారత్ జూడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ సుకుమార్ నారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఉస్మానియా యూనివర్శిటీ లెఫ్ట్, దళిత బహుజన విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ‘భారత దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలకు సవాళ్లు : పౌరులు, పౌర సంస్థల బాధ్యత’ అనే అంశంపై ఆర్టస్ కళాశాలలో చర్చను నిర్వహించారు. డాక్టర్ ఆమంచి నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ యాదవ్, దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ నారాయణ ముఖ్య వక్తలుగా విచ్చేసి ప్రసంగించారు.
ఈ సందర్బంగా ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ సుకుమార్ నారాయణలు మాట్లాడుతూ…ప్రస్తుత భారత ప్రజాస్వామ్య పరిస్థితి గురించి ఆందోళనలు వ్యక్తం చేశారు. భారత గణతంత్రం పౌరులకు సామాజిక-ఆర్థిక సమానత్వం అందించాల్సిన బాధ్యత గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను విచ్ఛిన్నం చేయడానికి అధికారంలో ఉన్నవారు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. సామాజిక-ఆర్థిక అసమానతలను పరిష్కరించడానికి కుల గణన యొక్క అత్యవసర అవసరాన్ని నొక్కిచెప్పారు. అంతేకాకుండా, ప్రజాస్వామ్యం యొక్క నిజమైన సారాంశం సమానత్వం, సంపద పంపిణీ, బలమైన ప్రతిపక్ష పార్టీలు, చట్టం యొక్క నిష్పాక్షికత, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండటమే అని ప్రజల సంక్షేమానికి సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం అనివార్యమని తెలియజేశారు.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా జరిగే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని వక్తలు పిలుపునిచ్చారు. అటువంటి ఉద్యమాలకు అవగాహన పెంచడంలో, మద్దతు కూడగట్టడంలో సంప్రదాయ, సోషల్ మీడియా కీలక పాత్రను వారు నొక్కి చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టస్ కళాశాల ప్రిన్సిపాల్ కుతాడి అర్జున్రావు, వైస్ ప్రిన్సిపాల్ బీనవేని రామ్ షెపర్డ్, డాక్టర్ కొండా నాగేశ్వరరావు, డాక్టర్ సమున్నత, డాక్టర్ వంశీధర్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.