కాంగ్రెస్పై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి
వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం
శిక్షణా శిబిరంలో నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 09 : తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల కోసం వంద రోజులు పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించండని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయ్యప్ప, శివ మాలధారణలా కాంగ్రెస్ దీక్ష తీసుకుని, సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలన్నారు. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో టీపీసీసీ ఆధ్వర్యంలో జిల్లా,మండల, బ్లాక్ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కునేందుకు బీజేపీ, బీఆరెస్ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేసున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొడుతూ వొచ్చే ఎన్నికల్లో ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేది బూత్ లెవెల్ ఏజెంట్ అని వ్యాఖ్యానించారు.
వొచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే క్షేత్ర స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ నియామకం జరగాలి. కాంగ్రెస్ జెండాను మోసే నిఖార్సైన కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించుకుందామని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 43 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేసుకున్నామన్నారు రేవంత్ రెడ్డి. 90 లక్షల వోట్లు తెచ్చుకుంటే రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రజాకార్లు కూడా ఇంత దోపిడీ, విధ్వసానికి పాల్పడలేదన్నారు. తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడం ఈ గడ్డకు దక్కిన గౌరవంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను ఉన్నప్పుడే సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడంతో తన జన్మ ధన్యమైందన్నారు. వక్ఫ్ భూమిలో నాంపల్లి విజయ నగర్ కాలనీలో ఎంఐఎం సభకు అనుమతి ఇచ్చారు. మరి తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వరు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేవుడి భూమి అనే సాకుతో అనుమతి నిరాకరించినా ఆ దేవుడే మనకు దారి చూపారు. రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చి విజయభేరీ సభ కోసం వంద ఎకరాలు ఇచ్చారు..ధర్మమే కాంగ్రెస్ను గెలిపిస్తుంది…వొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి… అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్
తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతుండటంపై రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. రేవంత్ తన ట్వీట్లో..‘తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పేద, మధ్యతరగతికి వైద్య ఖర్చు మోయలేని భారంగా ఉంది. డెంగ్యూ బారిన పడిన వారికి మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధి నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎంను డిమాండ్ చేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.