నిరాశజనకంగా మోదీ బడ్జెట్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాల విమర్శ
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి ‘మిత్ర కాల్’బడ్జెట్లో ఉద్యోగాలను సృష్టించే ఆలోచన లేదని, అలాగే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కువటానికి ఎటువంటి ప్రణాళిక లేదని ఎద్దేవా చేశారు. దేశ భవిష్యత్తును నిర్మించడానికి కేంద్రానికి ఎలాంటి రోడ్మ్యాప్ లేదని అన్నారు. మరోవైపు దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను పరిష్కరించేందుకు ఈ కేంద్ర బడ్జెట్ ప్రయత్నించడం లేదని కేరళ సీఎం పినరయి విజయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మధ్యంతర బడ్జెట్పై డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ మాట్లాడుతూ..బడ్జెట్లో ప్రత్యేకత ఏవిూ లేదన్నారు. మెరుగైన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి వాగ్దానాలు కనిపించడం లేదని చెప్పారు.
వొచ్చే పూర్తి బ్జడెట్ కోసం తాము ఎదురుచూస్తున్నామని, అయితే దానిని భారత్ కూటమి సమర్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మధ్యంతర బ్జడెట్ను డల్గా అభివర్ణించారు. ఈ బడ్జెట్ ఎక్కడుంది ఏదైనా ప్రకటన ఉందా అని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఏదైనా ప్రయత్నం ఉందా? విదేశీ రుణాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ఏమైనా చెప్పారా? అంటూ ప్రశ్నలు సంధించారు.
ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, రైతులు, కార్మికులు, యువత, మహిళల గురించి మాట్లాడే భారత బ్జడెట్ వస్తుందని తాము తీసుకొస్తామని హావిూ ఇచ్చారు. మధ్యంతర బడ్జెట్ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల లాలీపాప్ ఇచ్చిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలభ్ శుక్లా మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారానికి ఎలాంటి బ్లూప్రింట్ను సమర్పించని ఈ బడ్జెట్ ప్రభుత్వానికి ఇష్టమైన పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.