మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాదనలను సుప్రీమ్ కోర్టులో ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం వింటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది వివేక్ను నియమించామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. వివేక్ పాజిటివ్ వాదనలు వినిపిస్తున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రికి దళిత జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, ఆదివాసీలు అస్తిత్వం కోల్పోయేలా వ్యవహరించిందన్నారు. గద్దర్, అందెశ్రీ లాంటి గాయకులను బీఆర్ఎస్ విస్మరించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సరైన గుర్తింపు ఇచ్చిందన్నారు. సుప్రీమ్ కోర్టుపై సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. ఎవరికి వ్యతిరేకంగా వర్గీకరణ చెయ్యాలని అడగడం లేదన్నారు. ఎవరి వాటా వారికి దక్కాలనే దీని ఉద్దేశ్యమని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.