Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా…25 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజ్‌లు

వొచ్చే విద్యా సంవత్సరానికి మిగిలిన 8 జిల్లాల్లో.. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశం
9 ఏళ్లలో 21 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు
దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించింది
వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు
‘కంటి వెలుగు’పైనా సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీ లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. వొచ్చే యేడాది మిగిలిన 8 జిల్లాలో మెడికల్‌ ‌కాలేజీలు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 60 ఏళ్లలో 3 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో 21 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అతి తక్కువ సమయంలో మొత్తం 21 మెడికల్‌ ‌కాలేజీలు ప్రారంభించి తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించిందని  అన్నారు. ఇప్పటికే 33 జిల్లాల్లో  25 జిల్లాలకు మెడికల్‌ ఏర్పాటు కాగా మిగిలిన 8 జిల్లాల మెడికల్‌ ‌కాలేజ్‌లు ప్రారంభించేందుకు భూసేకరణకు  సంబంధించిన పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశించారు. శుక్రవారం డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో మంత్రి హరీష్‌ ‌రావు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిగితా 8 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న మెడికల్‌ ‌కళాశాలలకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆరోగ్య  శాఖ సెక్రెటరీ రిజ్విని మంత్రి ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఎన్‌ఎం‌సి గైడ్‌ ‌లైన్‌ల ప్రకారం మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేందుకు, ప్రభుత్వం తరఫునుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందరభంగా తెలిపారు. ఆరోగ్య శాఖ సిబ్బంది అధికారులు తమవంతు ప్రతి ఒక్కరు బాగా పని చేయాలని కోరుతున్నానని, కొద్ది కాలం నుండి మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వొస్తున్నాయి కాబట్టి విరామం లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, ఇందుకు ప్రభుత్వం తగిన సహాయ సహకారం అందిస్తుందని మంత్రి హరీష్‌ ‌రావు హామీ ఇచ్చారు. పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అనేక గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని, దేశంలోనే తెలంగాణ వైద్యరంగంలో అగ్రస్థానంలో నిలిచిందని, ఇది ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సంకల్పం, మీ అందరి కృషి వల్లే సాధ్యమైందని అన్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్‌ 1 ‌గా నిలవాలని సీఎం కేసీఆర్‌ ‌పెద్ద మొత్తంలో బడ్జెట్‌ ‌కేటాయించి కొత్త మెడికల్‌ ‌కాలేజీలు ఇచ్చారని, వైద్యులను, వైద్య పరికరాలను ఇచ్చారని, అడిగినవన్నీ మనకు వెంటనే మంజూరు చేస్తున్నారని, ముఖ్యమంత్రి  ఆశయం నెరవేరేలా మనందరం కృషి చేయాలని హరీష్‌ ‌రావు అధికారులకు పిలుపునిచ్చారు. స్పెషాలిటీ సేవలు జిల్లా పరిధిలోనే అందాలని మనం మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, ఎన్‌ఎం‌సి నిబంధనల ప్రకారం నడుచుకునేలా మెడికల్‌ ‌కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌ ‌లపైన ఉందని, తరగతులు, అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరారు.

‘కంటి వెలుగు’పై సమీక్ష
వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో భాగంగా కంటి వెలుగు కార్యక్రమంపై మంత్రి హరీష్‌ ‌రావు సమీక్షించారు. ఈ పథకం విజయవంతంగా 100వ రోజుకు చేరడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. శనివారంతో  కంటి వెలుగు పరీక్షలు ప్రారంభమై వందవ రోజుకు చురుకుంటుందని, ఇప్పటి వరకు 99 పనిదినాల్లో కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 40.59 లక్షల మందికి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించారని, 22.51 లక్షల మందికి రీడింగ్‌ ‌గ్లాసెస్‌ ‌పంపిణీ చేశారని, 18.08 లక్షల మందికి పిస్క్రిప్షన్‌ ‌గ్లాసెస్‌ ‌పంపిణీ జరిగిందని, మొత్తంగా ఇప్పటికే 24 జిల్లాల్లో స్క్రీనింగ్‌ ‌పూర్తయినట్లు హరీష్‌ ‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యలపై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నందున ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు మార్గదర్శనంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గత జనవరి 18 నుంచి వంద రోజుల కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.

స్క్రీనింగ్‌ ‌పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్‌ ‌గ్లాసెస్‌, ‌నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్‌ ‌గ్లాసెస్‌ ‌తప్పకుండా అందేలా చూస్తున్నారని, క్యాంపుల నిర్వహణ ప్రణాళికతో నిర్వహిస్తున్నారని అన్నారు. కంటి వెలుగు పూర్తయిన జిల్లాలో సిబ్బందిని తిరిగి తమ రెగ్యులర్‌ ‌విధులకు పంపిస్తూ మిగిలిన జిల్లాలలో సిబ్బందికి అవసరమైన భోజన, వసతి, వాహన సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. 100 శాతం పరీక్షలు పూర్తి కాని జిల్లాల్లో పరీక్షలు త్వరగా పూర్తి చేయాలని, ప్రచారం కల్పించి అవగాహన పెంచాలని అన్నారు. కంటి వెలుగు విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ఇతర శాఖలు, ప్రజాప్రతినిధులకు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో హెల్త్ ‌సెక్రెటరీ రిజ్వి, హెల్త్ ‌కమిషనర్‌ ‌శ్వేతా మహంతి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ‌సీఈవో విశాలాక్షి ,డిఎంఇ రమేష్‌ ‌రెడ్డి, డిహెచ్‌ ‌శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ ‌కుమార్‌ , ‌టిఎస్‌ఎం ఎస్‌ఐడిసి ఎండీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply