పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేసిన అధినేత కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్ వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నో రోజులుగా నాన్చుతున్న వరంగల్ ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీ కీలక నిర్ణయం వెల్లడించింది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ను ఎంపిక చేసినట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఅర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.
2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా అధినేతతో కలిసి పని చేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చించిన అనంతరం సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. కాగా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత కడియం కావ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసినా అనూహ్యంగా ఆమె బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో వరంగల్ వోటర్లలో గట్టి పట్టున్న నేతను బరిలో దించాలని ఆ పార్టీ యోచించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కేటీఆర్, హరీష్ రావు సేకరించిన అనంతరం వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. కాగా వరంగల్ ఎంపీ టికెట్ను తాటికొండ రాజయ్య కూడా ఆశించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్కు కూడా వెళ్లారు. రాజయ్యకు టికెట్ కన్ఫర్మ్ అని అనుకుంటుండగా చివరి నిమిషంలో సుధీర్ కుమార్ను కన్ఫర్మ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు కేసీఆర్. వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీచేస్తున్నారు.