- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
- ఎవరైనా వద్దంటే నా భార్యను నిలబెడతా
- అసెంబ్లీలో సమస్యలపై చర్చకు తావేదీ
- ఆరు నెలల తరవాత రెండ్రోజుల సమావేశాలా
- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య
సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తకే ఈసారి సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని, ఒకవేళ కార్యకర్తలు వద్దంటే తన భార్య నిర్మలను ఎన్నిక బరిలో నిలుపుతానని తెలిపారు. మళ్ళీ 2028 ఎన్నికల్లోనే పోటీ చేస్తానని అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, అయితే.. ఈ విషయంలో తనపై ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. తాను ఒక టర్మ్ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఎందుకు దూరంగా ఉన్నాననే విషయం తర్వాత అందరికీ తెలుస్తుందని చెప్పారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరిగాయి. యశ్వంత్ సిన్హాను కలిస్తే గోడకేసి కొడుతానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడంతో.. దానిపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు. నవంబర్ 5వ తేదీన గాంధీభవన్ లో ప్రెస్ వి•ట్ పెడుతానని, అప్పటి వరకు అటు వైపు వెళ్లనని ఈ మధ్య సంగారెడ్డిలో చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అద్దంకి దయాకర్, మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై కూడా ఏం మాట్లాడలేదు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశానికి కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరుకాలేదు.
భారత్ జోడో యాత్రకు కూడా వెళ్లేలేదు. కానీ, ఉన్నట్టుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే అసెంబ్లీ నిన్న 6 నిమిషాలకే ముగిసిందని, మళ్లీ రెండు రోజులే నిర్వహిస్తామనడం బాధాకరమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సభలో మాట్లాడానికి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకా.. ప్రతిపక్షాలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, ఆరు నెలల తర్వాత జరిగే సమావేశాలు మూడు రోజులకే పరిమితమా..? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించడానికి భయపడుతున్నారని విమర్శించారు.
కొన్ని డిపార్టుమెంట్లు బూజు పట్టిపోయాయని, హౌసింగ్ కనుమరుగైందని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, విద్య వ్యవస్థ బూజు పట్టిపోయిందన్నారు. విఆర్ఏ లు రాష్ట్రం వచ్చాక ఆగమయ్యారని, 23 వేల మంది విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలన్నారు. పే స్కేల్ పెంచాలని, రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ దేశం పట్టుకు తిరుగు తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమవు తున్నారని, అసెంబ్లీలో మాట్లాడే వీలుండదు కాబట్టి తాను నిరసన తెలుపుతానన్నారు. ఈ నెల 12న ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.