Take a fresh look at your lifestyle.

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

ఎగువనుంచి కొనసాగుతున్న ప్రవాహం

కర్నూలు,జూలై18:  శ్రీశైలం ప్రాజెక్టుకు అంతకంతకూ  వరద తాకిడి పెరుగుతోంది. ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో ఆలమట్టి, తుంగభద్ర జలాశయాలకు ఇన్‌లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం.. ఇంకా వరద వచ్చే అవకాశం ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి ప్రస్తుతం 3.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉంది. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. 110.34 టీఎంసీలకు చేరింది. మరో 4 రోజుల పాటు ఇదే స్థాయిలో వరద నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నాలుగు నుంచి అయిదు రోజుల్లో జలాశయం నిండే అవకాశం ఉంది. ఇక జూరాల ప్రాజెక్టుకు 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండగా 1.52 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర డ్యాంకు 1.68 లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా.. సుంకేశుల ద్వారా 1.52 లక్షల క్యూసెక్కులను శ్రీశైలానికి విడిచిపెడుతున్నారు.

ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 3.05 లక్షల క్యూసెక్కులు విడుదలవుతుండగా శ్రీశైలం డ్యాం వద్ద 3.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఎ•-‌లో నమోదవుతోంది. ఎడమగట్టు జల విద్యుత్‌ ‌కేంద్రంలో విద్యుదుత్పత్తి కోసం 31,784 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాగా, శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జునసాగర్‌కు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సాగర్‌కు 25,427 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కుడి, ఎడమ, వరద కాల్వలు, ఎస్‌ఎల్‌బీసీ, ప్రధాన జల విద్యుత్‌ ‌కేంద్రానికి నీటి విడుదల లేదు. పులిచింతలకు 4,257 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మూసీ ప్రాజెక్టుకు ఆదివారం ఇన్‌ప్లో తగ్గుముఖం పట్టింది. 3, 7, 10వ నంబరు గేట్లను మూసివేశారు.

Leave a Reply