- ముస్లింలకు పవిత్ర రంజాన్ పర్వదిన
- శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే హరీష్రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఈద్-ఉల్-ఫితర్ (పవిత్ర రంజాన్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగల్లో ఒకటి రంజాన్ అని కొనియాడారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అని అన్నారు.
లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. కుల మతాలకతీతంగా ఒకరి పండుగలను మరొకరు సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకునే సంస్కృతి మన తెలంగాణ వారిదన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు. ముస్లిం సోదర సోదరిమణులకు హరీష్రావు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.