అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు
న్యూ దిల్లీ, ఏప్రిల్ 12 : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని దిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో కవితను రౌస్ అవెన్యూ కోర్టు నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయానికి అధికారులు తరలించారు. శుక్రవారం నుంచే మూడు రోజుల పాటు కవితను సీబీఐ విచారించనుంది.
లిక్కర్ కేసులో కవిత పాత్ర, వంద కోట్ల ముడుపుల వ్యవహారం, సౌత్ గ్రూప్, భూముల వ్యవహారంపై కవితను సీబీఐ విచారణ చేయనుంది. మరోవైపు ఈ కేసులో మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, ఆయన వాట్సప్లో చేసిన డేటాకు అనుగుణంగా కవిత విచారణ సాగబోతుంది. ఈ కేసులో అప్రూవల్గా మారిన అనేక మంది ఇచ్చిన ఆధారాల ద్వారానే విచారణ కొనసాగనుంది. ఇటీవల పది రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు పలు అంశాలపై కవితను సీబీఐ విచారించనుంది. ఈ కేసులో సీబీఐ లోతుగా దర్యాప్తు చేయనుంది. కస్టడీ అనంతరం కోర్టు ముందు సీబీఐ ఏయే అంశాలను ప్రస్తావిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.