పదిమంది సిక్కు గురువులలో ప్రధములు గురునానక్ దేవ్. 1469లో పాకిస్తాన్ లోని ప్రస్తుతం లాహోర్ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్)లో నానక్ దేవ్ కార్తీక పౌర్ణమి పుణ్య దినాన నవంబర్ 29న హిందూ కుటుంబంలో జన్మించారు. హిందూ ఇస్లామియా మత గ్రంథాలను చదివి, అవగాహన చేసుకుని, రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం. సిక్కులు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు)ని విశ్వసిస్తారు. సిక్కుమత స్థాపకులై, ఏకేశ్వరోపాసనను ప్రబోధించి, కుల వ్యవస్థను వ్యతిరేకించారు. నానక్ దేవ్ అనంతరం ఈ గురు పరంపర కొనసాగు తున్నది. ఐదవ గురువు అర్జున్ తమకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధనలను సంకలనం చేసి, ‘‘గురుగ్రంథ సాహిబ్’’ పవిత్ర గ్రంథ రూప కల్పన గావించారు. నానక్ తండ్రి కళ్యాణ్ చంద్ దాస్ కలుమెహతాగా సుపరిచితులై, ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమాస్తాగా పని చేసే హిందూ పట్వారీ. తల్లి మాతా త్రిపుర, అక్క బీబీ నాన్కీ, నానక్ దేవ్ బాల్యం నుండే ప్రశ్నించే, ఆలో చించే తత్వం కలవారు.
చిరుప్రాయంలోనే మతపరమైన ఉపనయనం చేసి, జంధ్యం వేయబోగా తిరస్కరించి, అంతకంటే భగవంతుని నిజ నామాన్ని హృదయంలో ధరిస్తామని, భగవ న్నామం యజ్ఞోపవీతం నూలుపోగులా తెగిపోవడం, మట్టిలో కలిసి పోవడం ఉండక, అఖండంగా రక్షణ కలిగిస్తుందని వాదించారు. అత్యంత చిన్న వయసునుండి అక్క బీబీనాన్కీ, తమ్మునిలో భగవంతుని జ్యోతిని చూడగా, ఈ రహస్యాన్ని ఎవరితోనూ ఆమె పంచుకోలేదు. ఆమె నాన క్ జీ తొలి శిష్యురాలిగా పేరొందారు. బాల్యంలోనే హిందూ మతంలోని తాత్వికతకు ఆకర్షితులై జీవిత రహస్యాల అన్వేషణకై ఇల్లు వదలి పోయారు. ఈ క్రమంలోనే నానక్ దేవ్ ముఖ్య తాత్వికులైన కబీర్, రవిదాస్ లను కలుసుకున్నారు.
బతాలాకు చెందిన వ్యాపారి మూల్ చంద్ చోనా కూతురు సులేఖినిని వివాహ మాడారు. శ్రీచంద్,లక్ష్మీదాస్ అనే కుమారులు వారికి కలిగారు – 28ఏళ్ళ వయసులో నానక్ ఒక ఉదయం నది స్నానం, ధ్యానానికి వెళ్ళగా, మూడు రోజులు ఎవరికీ కన్పించలేదు. తిరిగి వచ్చి, దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను అని ప్రకటించారు. అనంతరం ‘‘హిందువూ లేడు, ముస్లిమూ లేడు’’ అని మత సామరస్య బోధనలను వ్యాప్తి చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు ప్రధాన దిశల్లో టిబెట్ దక్షిణాసియాలోని పలు ప్రాంతాలు, అరేబియా, మక్కా, బాగ్దాద్, ముల్తాన్ తదితరాలలో ఉదాసీలనే పేరున భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ, ప్రయాణాలు సాగిం చారు. నానక్ జీవిత చరమాంకంలో ఉచిత ప్రసాదం లభించిన కర్తార్ పూర్ లో జీవించారు. తాను తీసుకునే ఆహారాన్ని కుల, మత, ధన బేధం లేకుండా పంచుకునే వారు. పొలాలలో పని చేసి, జీవితం గడిపారు. కొత్త సిక్కు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించాక అక్టోబర్ 10న 1539లో తన 70వ ఏట స్వర్గప్రాప్తి పొందారు.
9440595494