- కోవిడ్ పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్య పెంపు
- అధికారులతో సిఎస్ సోమేశ్ ఉన్నతస్థాయి సమిక్ష
రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బీఆర్కే భవన్లో ఆయా శాఖల అధికారులతో ఉన్నత స్ధాయి సమిక్ష సమావేశం నిర్వహించారు. కొరోనా నుంచి కోలుకున్న తర్వాత సీఎస్ సోమేశ్ కుమార్ తొలిసారిగా ఈ సమిక్ష నిర్వహించారు. సమిక్ష సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం చేయాలని, కోవిడ్ అపోప్రియేట్ బిహేవియర్కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు పాటించేలా నిబంధనల అమలుకు కృషిచేయాలని ఆదేశించారు.
ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని, కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటళ్లు ఆక్సీజన్ను సక్రమంగా వినియోగించి, వృథాను అరికట్టేలా చైతన్యపరచాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎమ్ రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్టేష్రన్ డైరెక్టర్ ప్రీతి మినా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, వైద్యారోగ్య శాఖ అడ్వైజర్ టీ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. సిఎస్కు ఈ నెల 6న కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా ఆయన కోలుకున్నారు. ఈ క్రమంలో గురువారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం అయ్యారు.