ఒకరి మృతికి కారణమైన ద్విచక్ర వాహనదారుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గేట్ సమీపంలో ఒకరి మృతికి కారణమైన ద్విచక్ర వాహన దారుడికి తొమ్మిదవ ఎల్బీనగర్ సెషన్ కోర్టు న్యాయమూర్తి హరీష రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 6500 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. దీనికి సంబంధించి ఆమనగల్లు ఎస్సై బలరాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2021 సంవత్సరంలో కోనాపూర్ గేటు దగ్గర గల మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడ్తాల్ మండలం, నేరెళ్ల కోలు తాండ కి చెందిన కేతావత్ పిక్కు తన ద్విచక్ర వాహనం ను అతివేగంతో జాగ్రత్తగా నడిపి నడుచుకుంటూ వెళుతున్న ఆమనగల్లు పట్టణానికి చెందిన తోట రాములును ఢీకొన్నాడు. అతను మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో అప్పటి సీఐ ఉపేందర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘు సాక్షుల ద్వారా సరైన ఆధారాలను కోర్టులో రుజువు చేశారు. ఇట్టి కేసుకు సంబంధించి వాదనలు పూర్తయిన తర్వాత సంబంధిత కోర్టు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి కేతావత్ పిక్కు కి రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ. 6500 జరిమానా విధించినట్లు ఎస్ఐ బలరాం తెలిపారు. కేసులో సాక్షులను ప్రవేశపెట్టినందుకు కృషిచేసిన కోర్టు కానిస్టేబుల్ ను సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బలరాం అభినందించారు.