Take a fresh look at your lifestyle.

మూసీ పునరుజ్జీవానికి ‘థేమ్స్‌’ ప్లాన్‌

  • లండన్‌ టూర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి
  • థేమ్స్‌ రివర్‌ పాలక మండలితో చర్చలు
  • రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు సహకారానికి ఇరువురి మధ్య అంగీకారం

ప్రజాతంత్ర ఇంటెర్నెట్‌ డెస్క్‌, జనవరి 19 :పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకు వొస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్‌  మరింత శక్తివంతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి తెలిపారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి లండన్‌లో పర్యటించారు. లండన్‌లోని థేమ్స్‌ నదిని సందర్శించారు. ఈ సందర్భంగా థేమ్స్‌ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌ రెడ్డి గురువారం అక్కడి థేమ్స్‌ రివర్‌ పాలక మండలి, పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు  చర్చలు జరిపారు.  దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్‌ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ సియాన్‌ ఫోస్టర్‌, ఫోర్డ్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ హెడ్‌ రాజ్‌ కెహల్‌ లివీ సీఎంకు వివరించారు.

అందులో భాగంగా ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలన్నీ ఈ సందర్భంగా చర్చించారు. నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయని, హైదరాబాద్‌ సిటీకి అటువంటి ప్రత్యేకత ఉందని, అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ, ఉస్మాన్‌ సాగర్‌ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి వివరించారు. తన విజన్‌ 2050కు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముఖ్యమంత్రితో లండన్‌ అధికారులు సానుకూలతతో చర్చలు జరిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత  ప్రాధాన్యమిచ్చినట్లు అక్కడి అధికారులు వివరించారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే రెవిన్యూ మోడల్‌ను ఎంచుకోవాలని చెప్పారు.

ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే కొత్త విధానాలు ఎప్పటికప్పుడు గమనించటంతో పాటు, ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్‌లో మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు  చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ హామీ ఇచ్చింది. ఇదే సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్‌ లైన్‌, వివిధ సంస్థల భాగస్వామ్యంపైనా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్టమైన సహకారం అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శేషాద్రి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవెలప్‌ మెంట్‌ అథారిటీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దాన కిషోర్‌, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ బి.అజిత్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌, మూసీ రివర్‌ డెవెలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ అమ్రాపాలీ, ఇన్వెస్ట్‌ మెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌ స్పెషల్‌ సెక్రెటరీ విష్ణువర్ధన్‌ రెడ్డి, మూసీ రివర్‌ డెవెలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఎస్‌ఈ వెంకట రమణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచంలోని సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం

లండన్‌ లో భారతీయ మూలాలున్న ఎంపీలతో సీఎం రేవంత్‌ రెడ్డ

లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్‌ మినిస్టర్‌ ప్యాలెస్‌ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్‌ మరియు బ్రిటన్‌ మధ్య బలమైన బంధాలలో ఒకటైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం…’అన్నారు.వెస్ట్‌ మినిస్టర్‌ ప్యాలెస్‌ ను యునెస్కో 1016 సంవత్సరంలోనే  ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలో జరిగిన సమావేశంలో లేబర్‌ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు  మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘‘నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి లాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. కేవలం ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం.‘ అన్నారు.  ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ‘ఒకప్పుడు మీ దేశం మా దేశాన్ని పరిపాలించింది. మా కాంగ్రెస్‌ పార్టీనే మీకు వ్యతిరేకంగా పోరాడిరది. అప్పుడు మహాత్మ గాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే మీ దేశానికైనా మా దేశానికైనా ఇప్పటికీ మార్గదర్శకాలు…‘ అన్నారు. ఇదే సందర్భంగా తన స్వీయ అనుభవాలను సీఎం పంచుకున్నారు. ‘నాది గ్రామీణ ప్రాంతం. నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నేనున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య భావనను నరనరాన జీర్ణించుకున్న పార్టీ. నాకు ఈ అవకాశం వచ్చినట్లే.. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుంది…’ అన్నారు

Leave a Reply