- భాగ్యలక్ష్మి ఆలయంలో తొలుత పూజలు
- బాధ్యతలు అప్పగించిన బండి సంజయ్
- బండికి అన్యాయం జరిగిందంటూ రాజగోపాల్ ఆవేదన
- బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపియే అన్న కిరణ్ కుమార్ రెడ్డి
- డబుల్ ఇళ్లపై 24,25 తేదీల్లో ఆందోళన…రానున్న వందరోజులు కీలకమన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఉదయం 11.45 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఉదయం 7.30 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు అంబర్ పేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, తెలంగాణ ఏర్పడిన 2014లో ఓసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి సభలో.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించిన సమయంలో.. ఆయన్ను చూసి కన్నీళ్లు వొచ్చాయని..బాత్రూంకి వెళ్లి ఏడ్చానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. బండి సంబయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూనే..ఆయన వల్లే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు సంజయ్ నాయకత్వంలోనే జరిగాయని గుర్తు చేశారు. కేసీసీఆర్కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని.. కిషన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని ప్రకటించారు. మునుగోడులో నైతిక విజయం బీజేపీదే అన్నారాయన. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని ప్రచారం చేస్తున్నారని..ఎప్పటికీ అలా జరగదన్నారు. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో..బండి సంజయ్ గురించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన త్వరాత తెలంగాణలో మెదటసారి మాట్లాడుతూ…అధికార బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కు వోటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే అని అన్నారు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారటం ఖాయమన్నారు. ప్రైవేటు లిమిటెడ్ కంపేనీ, కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కలసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వొస్తుందన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతులో ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కారు తాళాలు బీజేపీ తీసుకోవాల్సిన సమయం వొచ్చిందన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి తన వంతు కృషి చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కొరకు బీజేపీ జాతీయ నాయకత్వం సంస్థాగత మార్పులు చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. బండి సంజయ్ను బీజేపీ జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. 2024 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలనే హైద్రాబాద్లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో వొచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.
డబుల్ ఇళ్లపై 24,25 తేదీల్లో ఆందోళన…రానున్న వందరోజులు కీలకమన్న కిషన్ రెడ్డి
రానున్న వంద రోజులు బీజేపీకి కీలకమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాధ్యతలు స్వీకరించాక ఆయన తదుపరి పోరాట కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ధర్నాలు చేస్తామని తెలిపారు. ఈ నెల 25న డబుల్ లబ్దిదారులతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త పెన్షన్ దారుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని, కొత్త రేషన్ కార్డుల కోసం బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు.
రాజశేఖర రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ..సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్లో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ ఇలాకాలో కిషన్ రెడ్డి తొలిసారి పర్యటిస్తున్నారు. జైలుకు వెళ్ళొచ్చిన బీజేపీ కార్యకర్తలను కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు.