రాష్ట్రానికి కేంద్రం ఖర్చు చేసిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై రాష్ట్ర మంత్రి హరీష్ రావు మండిపాటు
పూర్తి వివరాలను త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తామని ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ..కాన్సన్ట్రేషన్ తక్కువ అని…ఫస్ట్రేషన్తో పట్టపగలు పచ్చి అబద్దాలతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్రం ఖర్చు చేసిన నిధుల వివరాలు వెల్లడిస్తూ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు అమిత్ షా గతంలో చెప్పిన అబద్ధాలనే కిషన్ రెడ్డి రిపీట్ చేసిండు తప్ప పనికొచ్చేది ఒక్కటీ మాట్లాడ లేదని, రాష్ట్రానికి ఇచ్చే రుణాలు, ప్రజలకు బ్యాంకులు ఇచ్చిన వ్యక్తిగత రుణాలను కూడా కిషన్ రెడ్డి కేంద్రం ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జన్ ధన్ ఖాతాల గురించి మాట్లాడుతున్నారని, ప్రారంభించిన వాటిలో 50 శాతానికి పైగా మనుగడలో లేవన్న సంగతి కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు హరీష్ రావు. పన్నుల పంపిణీ అనేది రాష్ట్రాల రాజ్యాంగ హక్కు అని, పన్నుల పంపిణీ భారతదేశం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్లో భాగం కాదని, ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41 శాతం ఉన్నప్పటికీ, రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో దాదాపు 30% మాత్రమే పొందుతున్నాయని, ఎందుకంటే కేంద్రం పన్నుల భాగస్వామ్య పూల్లో భాగం కాని సెస్సులు మరియు సర్చార్జీలు విధిస్తుందని, పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా 2014-15లో 2.893 శాతం ఉండగా 2021-22 నాటికి 2.102 శాతంకి తగ్గిందని తన ప్రకటనలో తెలిపారు. కేంద్ర వాటాగా రూ.1588.08 కోట్లతో తెలంగాణలో 100 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా నీటిని సరఫరా చేశామని కిషన్ రెడ్డి అన్నారు ..నిజానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద దాదాపు రూ 36,000 కోట్లు వెచ్చించిందని 100 శాతం గృహాలకు నీటి సరఫరా చేసిందని, కేంద్రం ఇస్తున్న మొత్తం మిషన్ భగీరథ నిర్వహణకు కూడా సరిపోదని, ఇంత పచ్చిగా కిషన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తారా,,అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
రాబడి, వ్యయ ప్రవాహాల మధ్య అసమతుల్యతలను అధిగమించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా అన్ని రాష్ట్రాలకు అందించబడిన స్వల్పకాలిక సదుపాయమే మార్గాలు మరియు సాధనాలు(వేస్ అండ్ మీన్స్ ) అని, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించే సదుపాయమని, ఈ అడ్వాన్సులపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6 శాతం వడ్డీ రేటును చెల్లించాలని, కానీ కేవలం తెలంగాణకే ప్రత్యేకంగా ఆర్బిఐ ఎదో చేస్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ నుంచి 2017-18 నుండి 2022-23 వరకు జిఎస్టి పరిహారం సెస్గా 34,737 కోట్లు వసూలు చేయబడ్డాయని, కానీ తెలంగాణకు దక్కింది కేవలం రూ. 8,927 కోట్లు మామ్రేనని, జిఎస్టి ప్రవేశపెట్టిన మొదటి రెండేళ్లలో పరిహారంగా వొచ్చింది 169 కోట్ల రూపాయలు మాత్రమేనని, ఈ రెండేళ్లలో తెలంగాణ నుంచి వసూలైన జీఎస్టీ సెస్ రూ. 10,285 కోట్లు ఉందని, పరిహారం మొత్తం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి రాలేదు కానీ, జిఎస్టి పరిహార నిధి నుంచి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదని, అది తమ హక్కని తెలిపారు హరీష్ రావు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం 5 సంవత్సరాల కాలానికి వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి రూ.2,250 కోట్లు విడుదల చేయబడ్డాయని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చట్ట ప్రకారం ఉన్నా 2019-20, 2020-21 మరియు 2022-23 సంవత్సరాలకు ఎటువంటి మొత్తం విడుదల కాలేదని, కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి మా పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఈ మూడేళ్లకు గాను రూ. 1350 కోట్లు ఎలాంటి కారణం లేకుండా నిలుపుదల చేశారని, దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారంటూ హరీష్ రావు ప్రశిచారు. జాతీయ రహదారులకు కేటాయింపులు రోడ్డు మరియు మౌలిక సదుపాయాల సెస్ల నుండి జరుగుతాయని, కేంద్ర ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ లేదని, తెలంగాణకు కేటయించిన నిధులు కిషన్ రెడ్డి మెహర్భానీతో రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి ఆహార ధాన్యాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ 1.58 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని, వాస్తవానికి, ఈ ఖర్చులో ఎక్కువ భాగం పిడిఎస్ కింద ఈ ఆహార ధాన్యాల విక్రయం ద్వారా తిరిగి కేంద్రం తిరిగి రాబట్టు కుంటుంవని, అయినా యాసంగిలో ధాన్యం కొనుగోలుకు రైతులను కేంద్రం అరిగోస పెట్టిన విషయాన్ని ఎవరు మరచిపోతారు రని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలను నూకలు తినాలని ఉచిత సలహా ఇచ్చి అవహేళన చేయలేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎరువుల సబ్సిడీ రూ. 33వేల కోట్లు ఇస్తున్నట్టు కిషన్ రెడ్డి చెబుతున్నారని, గత ప్రభుత్వాలు ఈ సబ్సిడీ ఇవ్వలేదా లని అన్నారు.
ఈ రాయితీని తెలంగాణలోని రైతులకు కాకుండా తెలంగాణలో ఉన్న ఎరువుల కంపెనీలకు ఇస్తున్నారని, ఎరువుల కంపెనీకి ఇచ్చే సబ్సిడీని తెలంగాణ రైతులకు ఇచ్చే సబ్సిడీగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఆర్బిఐ అనేది స్వతంత్ర సంస్థ అని..ఓవర్ డ్రాఫ్ట్ ఇతర ఆర్థిక విషయాల్లో రిజర్వ్ బ్యాంకు కొన్ని వెసులు బాట్లు ఇవ్వడం సహజమని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే కొన్ని సార్లు మనకు ఇచ్చారని, ఏ వెసలు బాటు ఇచ్చినా దానికి వడ్డీ కూడా ఆర్బిఐ వసూలు చేస్తుందని, దీంట్లో బీజేపీ గొప్పతనం ఏముందన్నారు. ఆర్బిఐ స్వతంత్ర సంస్థ కాదు కేంద్రం చెప్పు చేతల్లో ఉండే సంస్థ అని కిషన్ రెడ్డి చెప్పదలుచుకున్నారా..అంటూ తన ప్రకటనలో మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ పౌరులకు బ్యాంకులు లోన్లు ఇవ్వాలా వద్దా అనేది బీజేపీ చెబితే జరుగుతుందా అన్నారు. రకరకాల నిబంధనల ప్రకారమే బ్యాంకులు రుణాలు ఇస్తాయని, ఇందులో కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ఏముందని, కిషన్ రెడ్డి లేని గొప్పలు చెప్పుకోవడానికి తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టం హమీలు ఎందుకు నెరవేర్చరో కిషన్ రెడ్డి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు యివ్వరూ…కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..బీబీనగర్ ఎయిమ్స్ కు నామమాత్రంగా నిధులు విడుదల చేసి నత్త కూడా సిగ్గు పడేలా పనులు జరుగుతుంటే కిషన్ రెడ్డి కేంద్రం గొప్ప తనమని చెప్పుకుంటారా అని హరీష్ రావు మండిపడ్డారు. ఆయుష్మాన్ కింద ఇచ్చేది గోరంత అని, ఆరోగ్య శ్రీ కింద మేమిచ్చేది కొండంత అన్నారు. రాష్ట్రానికి రావలసిన బకాయిలపై కేంద్రానికి లేఖలు రాసి రాసి అలసిపోయామని, ముందు వాటిని కిషన్ రెడ్డి ఇప్పించాలని తన ప్రకటన ద్వారా హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాము అసెంబ్లీలో చెప్పామని, అంతటా చెబుతున్నామని, అయినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది తప్ప జరిగింది లేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా రాష్ట్రానికి ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయల పరిహారాన్ని మూడేండ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని, ఏపీ ఖాతాలో పొరపాటున జమ అయిన 495 కోట్ల రూపాయలను తొమ్మిదేళ్ల నుంచి అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు 24 వేల 205 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతీ ఆయోగ్ సూచించినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బోరు బావుల మోటార్లకు విద్యుత్ మీటర్ల నిబంధనతో రాష్ట్రానికి 30 వేల కోట్లు నష్టం చేశారని, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు మార్చడం వల్ల 15 వేల 33 వేల కోట్ల రూపాయలు రాష్ట్రం నష్ట పోయిందని, పన్నుల వాటా సక్రమంగా అమలు చేసి ఉంటె 33 వేల 712 కోట్ల బకాయిలు రాష్ట్రానికి అదనంగా వొచ్చేవన్నారు. ఇలా అన్ని కలిపి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన లక్షా 43 కోట్ల రూపాయలను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో కిషన్ రెడ్డి దగ్గర సమాధానం ఉంటే చెప్పాలన్నారు. ముందు కిషన్ రెడ్డి ఈ మొత్తాన్ని రాష్ట్రానికి సాధించి పెట్టి మిగతా విషయాలు మాట్లాడాలని, గుజరాత్తో పోలిస్తే తెలంగాణకు ఏమిచ్చారో అది చెప్పాలని, కిషన్ రెడ్డి మాట్లాడిన కొన్ని అబద్ధాలకు మాత్రమే నేడు సమాధానం ఇస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. కిషన్ రెడ్డి అబద్దాల పుట్టను త్వరలోనే పూర్తి ఆధారాలతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో బద్దలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.