అన్ని కేసుల్లోనూ సుప్రీం బెయిల్
కేసులను దిల్ల్లీకి బదిలీ చేస్తూ ఆదేశాలు
న్యూ దిల్లీ,జూలై20: ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబేర్ను ఆదేశించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. జుబేర్ పై నమోదైన కేసులన్నింటినీ దిల్లీ స్పెషల్ పోలీస్ విభాగానికి బదిలీచేస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. జుబేర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు యూపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ను కూడా రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబేర్ పై ప్రస్తుతం నమోదైన కేసులతో పాటు భవిష్యత్లో నమోదయ్యే కేసులు కూడా దిల్ల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది.
ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని దిల్లీ హైకోర్టును జుబేర్ ఆశ్రయించవచ్చని తెలిపింది. 2018లో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. దాని కోసం ఓ సినిమా క్లిప్ను కూడా వాడారు. ఈ కేసులో జుబేర్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మతపరమైన భావాలను కించపరిచినట్లు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను కావాలనే దెబ్బతీయాలన్న కక్ష్యతో సోషల్ డియాలో జుబేర్ ఇలాంటి పోస్టులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను కూడా ముందుగా ట్వీట్ చేసింది కూడా జుబేర్ కావడం విశేషం.